ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కాగా వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ కూడా అందుకు అనుగుణంగా అప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. కాగా ఇప్పటికే సెట్టింగ్స్ విషయంలో స్టేటస్, ప్రొఫైల్, లాస్ట్ సీన్, చాట్ ఇలా అనేక రకాల ఫీచర్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ వినియోగదారుల కోసం వాట్సాప్ సంస్థ మరో సరికొత్త అదిరిపోయే అప్డేట్ ని తీసుకువచ్చింది.
ఆ వివరాల్లోకి వెళితే.. వాట్సాప్ సంస్థ తాజాగా తీసుకువచ్చిన ఆ సరికొత్త ఫీచర్ కంపానియన్ మోడ్. ఈ ఫీచర్ సహాయంతో, వినియోగదారులు ఎక్కువ డివైజ్లలో లాగిన్ అవ్వవచ్చు. అనగా ఈ కంపానియన్ మోడ్ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఇతర పరికరాలలో కూడా అదే వాట్సాప్ ఖాతాను ఉపయోగించగలరన్నమాట. తాజాగా తీసుకువచ్చిన ఈ సరికొత్త అప్డేట్తో మీరు ప్రతి లింక్ చేయబడిన పరికరంలో స్వతంత్రంగా పని చేయవచ్చు. ప్రాథమిక పరికరంలో నెట్వర్క్ కనుగొనబడనప్పుడు ఇతర ద్వితీయ పరికరాలలో ఖాతాలను యాక్సెస్ చేసుకోవచ్చు.
వాట్సాప్ ఖాతాను అనేక మార్గాల్లో లింక్ చేయవచ్చు. మీరు మీ ప్రాథమిక డివైజ్ను మరొక డివైజ్లో వాట్సాప్ ఖాతాతో లింక్ చేయాలనుకుంటే, మీరు ద్వితీయ డివైజ్ వాట్సాప్ అప్లికేషన్లో ఫోన్ నంబర్ను నమోదు చేయాలి. ఇప్పుడు మీ ప్రాథమిక డివైజ్లో అందుకున్న ఓటీపీ ని నమోదు చేయాలి. అదేవిధంగా, ఇతర డివైజ్లు కూడా ప్రాథమిక డివైజ్లోని కోడ్ని స్కాన్ చేయడం ద్వారా లింక్ చేయవచ్చు. కాగా తాజాగా వాట్సాప్ సంస్థ తీసుకువచ్చిన ఈ సరికొత్త ఫీచర్ పట్ల వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.