ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దానికి తోడు ఇటీవల కాలంలో వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరుగుతుండడంతో వినియోగదారులను మరింత పెంచుకోవడం కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంది. ఇకపోతే వినియోగదారుల కోసం ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ.
వినియోగదారులు తమ అసంపూర్తి సందేశాలను మరింత సులభంగా నిర్వహించడంలో సహాయపడే లక్ష్యంతో వాట్సాప్ మెసేజ్ డ్రాఫ్ట్స్ అనే కొత్త ఫీచర్ ను విడుదల చేసింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండింటి వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. పాక్షికంగా టైప్ చేసిన సందేశాలను చాట్ థ్రెడ్ లలో కోల్పోకుండా నిరోధించడానికి ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఫీచర్ అసంపూర్తిగా ఉన్న సందేశాలను సేవ్ చేయడానికి, గుర్తించడానికి అనుకూలమైన మార్గాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ కొత్త అప్డేట్ తో అసంపూర్తిగా ఉన్న ఏదైనా మెసేజ్ ఆటోమేటిక్గా డ్రాఫ్ట్ లేబుల్ తో చాట్ లిస్ట్ పైన కనిపిస్తుంది. ఇలా కనిపించడం ద్వారా మెసేజ్ టైప్ చేస్తూ ఏదైనా అనుకోని సందర్భంలో మర్చిపోతే వెంటనే ఆ మెసేజ్ను గుర్తుపట్టవచ్చట. చాలా మంది వాట్సాప్ వినియోగదారులకు ముఖ్యంగా వర్క్, పర్సనల్ కమ్యూనికేషన్ రెండింటికీ యాప్ని ఉపయోగించే వారికి ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో వాట్సాప్ యూజర్లు ఒకేసారి ఎక్కువ చాట్లను నిర్వహించడం పరిపాటిగా మారింది. ఇలాంటి సమయంలో కొన్నిసార్లు సందేశాలు అనుకోకుండా మధ్యలో వదిలివేస్తారు. అందువల్ల డ్రాఫ్ట్ ఫీచర్ తో వినియోగదారులు ఇకపై అంతులేని చాట్ ల ద్వారా స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డ్రాఫ్ట్ మెసేజ్ లను సెర్చ్ చేసి వారు మధ్యలో వదిలేసిన మెసేజ్ ను పూర్తి చేయవచ్చట. ఈ ఫీచర్ యూజర్ అనుభవాన్ని, కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.