Google: వరుసగా ఉద్యోగులను తొలగిస్తూ సంచలనానికి తెరలేపిన గూగుల్ ఇప్పుడు ఒక్కసారిగా మళ్లీ ఉద్యోగులను తీసుకుంటామంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో లే ఆఫ్ గొడవ ఇక ముగిసినట్టేనా అని టెక్నాలజీ వర్గంలో చర్చ మొదలైంది. ఆర్థిక మాంద్యం మూలంగా అమెరికా సహా ప్రపంచంలోనే అన్ని దేశాల్లోనూ గూగుల్ తమ ఉద్యోగులను తగ్గిస్తూ వస్తోంది.తాజాగా భారత దేశంలో కూడా 450 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
వరుస తొలగింపుల తర్వాత ప్రస్తుతం నియామక ప్రక్రియ ప్రారంభించి, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సంచలనానికి తెరతీశారు. గత నెలలో పిచాయ్ గూగుల్ మొత్తం వర్క్ఫోర్స్లో ఆరు శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు 12,000 మంది ఉద్యోగులు తొలగిస్తామని తెలిపారు. అయితే ఇప్పుడు వస్తున్న రిపోర్టులు గూగుల్ ఉద్యోగుల తొలగింపులను ముగించి నియామకాలను ప్రారంభించిందని చెబుతున్నాయి. గూగుల్ ఇండియా లింక్డ్ఇన్లో అనేక ఉద్యోగుల ఖాళీలను కూడా పోస్ట్ చేసింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం గూగుల్ తో పాటు మరిన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా ఉద్యోగులను మళ్లీ రిక్రూట్ చేసుకోవడం మొదలు పెడుతున్నాయి. భారతీయ ఐటీ దిగ్గజం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లేఆఫ్ ప్లాన్ ను పక్కన పెట్టి, కొత్త రిక్రూట్ మెంట్ దిశగా అడుగులు వేస్తోంది. అయితే FY23 మూడవ త్రైమాసికంలో 2,197 మంది ఉద్యోగులకు తగ్గించుకున్నట్లు తెలిపింది.