ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు టీనేజర్ల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాన్నీ మెటా నివేదిక తేల్చి చెప్పింది. మెటా అంతర్గత పరిశోధనల ప్రకారం, 13 నుండి 19 ఏళ్ల మధ్య వయస్సు గల టీనేజర్ల మెదడు అభివృద్ధి దశలో ఉంటుంది, ఇది కొత్తదనం మరియు తక్షణ ఆనందం (Instant Gratification) కోసం పరితపిస్తుంది. దీనిని ఆసరాగా చేసుకుని ఇన్స్టాగ్రామ్ తన ఆల్గారిథమ్లను రూపొందించిందని కోర్టులో పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. “ఇన్ఫినిట్ స్క్రోలింగ్”, “ఆటో ప్లే” వంటి ఫీచర్లు టీనేజర్లను ఒక రకమైన నిస్సహాయ స్థితిలోకి నెట్టివేస్తున్నాయని, వారు దీనిని వదలాలనుకున్నా “FOMO” (Fear Of Missing Out) కారణంగా బయటకు రాలేకపోతున్నారని అంతర్గత నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా 2019 నాటి నివేదికల్లో “అడిక్టివ్ నరేటివ్” అనే పదాన్ని వాడటం, ఈ ప్లాట్ఫారమ్ వ్యసనకారి అని కంపెనీకి ముందే తెలుసనే వాదనకు బలంచేకూరుస్తోంది.
సోషల్ మీడియా వాడకం వల్ల టీనేజర్లలో, ముఖ్యంగా అమ్మాయిలలో తమ శరీరాకృతి (Body Image) పట్ల ఆందోళన, కుంగుబాటు (Depression), మరియు ఒంటరితనం పెరుగుతున్నాయని విచారణలో వెల్లడైంది. ఒక 20 ఏళ్ల యువతి కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం అందరినీ కలిచివేసింది; చిన్న వయసులోనే ఇన్స్టాగ్రామ్కు అలవాటు పడటం వల్ల ఆత్మహత్య ఆలోచనల వరకు వెళ్లానని ఆమె పేర్కొనడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. మెటా రూపొందించిన “టీన్ ఫండమెంటల్స్” వంటి స్లైడ్షోలు టీనేజర్ల భావోద్వేగ బలహీనతలను ఎలా వాణిజ్యపరంగా వాడుకోవచ్చో చర్చించాయని ఆరోపణలు వస్తున్నాయి. మెటా ఈ ఆరోపణలను ఖండిస్తూ తాము పేరెంటల్ కంట్రోల్ టూల్స్ తెచ్చామని చెబుతున్నప్పటికీ, అవి క్షేత్రస్థాయిలో ఎంతవరకు ఫలితాలనిస్తున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
బిగ్ టెక్ కంపెనీలకు ‘టోబాకో మూమెంట్’
ఈ న్యాయపోరాటాన్ని నిపుణులు గతంలో పొగాకు కంపెనీలు ఎదుర్కొన్న సంక్షోభంతో పోలుస్తున్నారు. సిగరెట్లు ఆరోగ్యానికి హానికరమని తెలిసి కూడా పొగాకు కంపెనీలు ఎలాగైతే నిజాలను దాచిపెట్టాయో, మెటా కూడా అలాగే వ్యవహరించిందని పిటిషనర్లు వాదిస్తున్నారు. లాస్ ఏంజిలస్ కోర్టులో జరుగుతున్న ఈ విచారణ కేవలం మెటాకు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిగ్ టెక్ కంపెనీలకు ఒక హెచ్చరికగా మారింది. ఒకవేళ ఈ కేసులో మెటాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే, సోషల్ మీడియా నియంత్రణ చట్టాల్లో పెను మార్పులు రావడం ఖాయం. పిల్లల రక్షణ కోసం కొన్ని దేశాలు ఇప్పటికే 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను నిషేధించిన నేపథ్యంలో, తల్లిదండ్రులు తమ పిల్లల డిజిటల్ అలవాట్లపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది.
