భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. ఏడాది లోపు పిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇకపోతే ప్రస్తుత రోజుల్లో ఈ ఆధార్ కార్డు వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రతి చిన్న అవసరానికి ఆధార్ ఆధారంగా మారుతోంది. బ్యాంకు ఖాతా కోసమైనా, వ్యక్తిగత ధ్రువీకరణ కోసమైనా, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడానికి యూఐడీఏఐ జారీ చేసే ఆధార్ కార్డు కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఈ నెల నుంచి ఆధార్ కు సంబంధించిన కీలక నియమాన్ని యూఐడీఏఐ మార్పు చేసింది.
అక్టోబర్ 1 నుంచి నిర్దిష్ట ఆర్థిక, పన్ను సంబంధిత ప్రక్రియల కోసం వ్యక్తిగత గుర్తింపు వినియోగానికి సంబంధించి ముఖ్యమైన మార్పులను యూఐడీఏఐ అమలు చేసింది. ఇకపై వినియోగదారులు పాన్ కేటాయింపు లేదా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ల కోసం ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ ఇచ్చే సదుపాయాన్ని రద్దు చేసింది. ఈ తాజా చర్యలు ఆధార్ సిస్టమ్లో పారదర్శకతను మెరుగుపరచడానికి జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆధార్ నమోదు ఐడీ అనేది ఆధార్ నమోదు సమయంలో వ్యక్తులకు కేటాయించే ఒక ప్రత్యేక ఐడెంటిఫైయర్ నంబర్. ఇది అధికారిక ఆధార్ నంబర్ జారీ చేసే వరకు ఆధార్ అప్లికేషన్ స్థితిని ట్రాక్ చేయడానికి ఇది తాత్కాలిక సూచనగా పని చేస్తుంది.
ఈ నమోదు ఐడీ 14 అంకెల సంఖ్యతో పాటు 14 అంకెల తేదీ స్టాంప్ ను కలిగి ఉంటుంది. ఇది నమోదు ప్రక్రియను పర్యవేక్షించడంలో సహాయ పడుతుంది. ఆధార్ నంబర్ స్థానంలో ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీను ఉపయోగించడాన్ని నిలిపివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం అక్టోబర్ 1 నుండి అమలు లోకి వచ్చింది. ఈ నెల నుంచి పాన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు లేదా ఆదాయపు పన్ను దాఖలు చేసేటప్పుడు వారి ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీను అందించాల్సిన అవసరం లేదుట. కేంద్ర బడ్జెట్ 2024లో పన్నుల ప్రయోజనాల కోసం ఆధార్ నంబర్కు బదులుగా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీను కోట్ చేసే ఎంపికను నిలిపివేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అదనంగా వారి ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ ఆధారంగా పాన్ కేటాయించిన వ్యక్తులు తప్పనిసరిగా నోటిఫైడ్ తేదీలోగా తమ ఆధార్ నంబర్ ను ఆదాయపు పన్ను అధికారులకు అందించాలని ప్రతిపాదించారు.
పాన్ కేటాయింపు లేదా ఆదాయ వాపసు కోసం దరఖాస్తు ఫారమ్లో ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీను కోట్ చేయడానికి అనుమతించే నిబంధనలు 2017లో ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఆధార్ నంబర్ రేంజ్ పెరుగుతోంది. అయితే భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న నేపథ్యంలో ఆధార్ దరఖాస్తు ఫారమ్ నకు సంబంధించిన ఎన్రోల్మెంట్ ఐడీని కోట్ చేసే ఎంపికను నిలిపివేయడం అత్యవసరమని నిపుణులు వాదిస్తున్నారు. ఎందుకంటే ఎన్రోల్మెంట్ ఐడీతో పాన్ కేటాయిస్తే దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు.