India vs South Africa ODI Series: దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్ 1-1 డ్రాగా ముగిసింది. ఇప్పుడు మూడు వన్డేల మ్యాచ్ల సిరీస్ కు సిద్దమవుతుంది టీమిండియా. ఈ సిరీస్ డిసెంబర్ 17 నుండి ప్రారంభమవుతుంది. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత భారత జట్టు మొదటిసారి వన్డే మ్యాచ్ ఆడుతోంది. కెఎల్ రాహుల్ నేతృత్వంలోని యువ భారత జట్టు బలమైన ఆఫ్రికన్ జట్టును సవాలు చేయడానికి సిద్ధంగా ఉంది. టీ20 ప్రపంచకప్కు ఇంకా 6 నెలల సమయం ఉండడంతో ఈ సిరీస్ లు జట్టు కూర్పుకి ఎంతో ఉపయోగపడనున్నాయని అంటున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు విశ్రాంతి లభించింది. తద్వారా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో యువ ఆటగాళ్లు తమ సత్తాని నిరూపించుకునేందుకు మంచి అవకాశంగా భావిస్తున్నారు.
రితురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్లకు ఓపెనింగ్ అవకాశం వస్తుందని భావిస్తున్నారు. సంజూ శాంసన్ మూడో స్థానంలో, శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో, కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో రావచ్చు. నెం.6లో మ్యాచ్ ఫినిషర్ రింకూ సింగ్ తన వన్డే అరంగేట్రం చేసే అవకాశం ఉంది.దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో రింకూ తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు వన్డేల్లో చెలరేగేందుకు సిద్ధమయ్యాడు.
బౌలింగ్ దళంలో సీనియర్ ఫాస్ట్ బౌలర్లు బుమ్రా, షమీ, సిరాజ్ ఈ సిరీస్లో ఆడడం లేదు. బుమ్రా, సిరాజ్లు టెస్టు సిరీస్లో ఆడనుండగా, షమీ ఫిట్నెస్ కారణంగా సిరీస్కు దూరమయ్యాడు. కాబట్టి భారత పేస్ దాడి బాధ్యత అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ మరియు అర్ష్దీప్ సింగ్ భుజాలపై పడింది. కాగా మూడో టీ20 మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అతడిని తప్పించి యుజ్వేంద్ర చాహల్కు అవకాశం ఇచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు విశ్లేషకులు. నిజానికి ఈ సిరీస్ కు చాహల్ కు చోటు కల్పిస్తారని అందరూ భావించారు.
భారత ప్లేయింగ్ XI:
రీతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్
Also Read: Bhogapuram Airport : భోగాపురం విమానాశ్రయం నమూనా వీడియోను విడుదల