World Cup Trophy: ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడలనేది ప్రతి క్రికెటర్ కల. కెరీర్లో ఎన్నో అద్భుతమైన రికార్డులు, అరుదైన ఘనతలను సాధించినా.. ఆటగాళ్లు కనీసం ఒక్క ప్రపంచకప్ టైటిల్నైనా సాధించాలని తహతహలాడుతుంటారు. ఇక ప్రపంచ కప్ మ్యాచ్లను నేరుగా వీక్షించడం కంటే అభిమానులకు మరో సంతోషం ఉండదు.. ఫైనల్లో ట్రోఫీ ప్రదానం కార్యక్రమం అభిమానులకు కన్నుల పండుగగా ఉంటుందనడంలో సందేహం లేదు. ప్రపంచ కప్ ను దగ్గరనుండి చూడటం కూడా అదృష్టమే. హైదరాబాద్ వాసులకు ఇప్పుడు ఆ అవకాశం దక్కింది.ప్రపంచ దేశాలను చుట్టేస్తున్న వన్డే ప్రపంచకప్ ట్రోఫీ ఇప్పుడు భాగ్యనగరానికి చేరుకుంది.
వందేళ్ల చరిత్ర కలిగిన చార్మినార్ ఎదుట గురువారం ట్రోఫీని ప్రదర్శించారు. చార్మినార్తో పాటు ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ట్రోఫీని ప్రదర్శించనున్నారు. ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అక్టోబర్లో ఉప్పల్లో మూడు మ్యాచ్లు జరగనున్నాయి. అంతకు ముందు తాజ్ మహల్ ముంగిట కూడా ట్రోఫీని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ప్రపంచ కప్ ఇప్పటికే అనేక దేశాలు చుట్టివచ్చింది. జూన్ 27న భారత్లో ప్రారంభమైంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పపువా న్యూ గినియా, యూఎస్ఏ, వెస్టిండీస్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, కువైట్, బహ్రెయిన్, ఇండియా , ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్, మలేషియా, ఉగాండా, నైజీరియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలు తిరిగి సెప్టెంబర్ 4న భారత్కు చేరుకుంది.
Also Read: KCR: మంత్రులపై కేసీఆర్ అసంతృప్తి, కారణమిదే!