IPL: ఐపీఎల్ ప్రసారాలు ఫ్రీగా చూడండిలా..రిలయన్స్ బంపరాఫర్

ఐపీఎల్‌ సీజన్‌ వచ్చిందంటే చాలు క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఆనందపడుతుంటారు. మ్యాచుల కోసం టీవీలకు అతుక్కుపోయి వినోదాన్ని పొందుతుంటారు.

  • Written By:
  • Publish Date - January 11, 2023 / 10:48 PM IST

IPL: ఐపీఎల్‌ సీజన్‌ వచ్చిందంటే చాలు క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఆనందపడుతుంటారు. మ్యాచుల కోసం టీవీలకు అతుక్కుపోయి వినోదాన్ని పొందుతుంటారు. అయితే ఇప్పటి వరకు కూడా ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్‌ కింద కొంతమొత్తంలో అమౌంట్ చెల్లించాల్సి ఉండేది. అలా సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నవారే ప్రసారాలు చూసేవారు. అయితే ఈసారి ఉచితంగా ఐపీఎల్‌ ప్రసారాలను అందించేందుకు రిలయన్స్‌ భారీ సన్నాహాలు చేస్తూ వస్తోంది.

2023 ఐపీఎల్‌ సీజన్‌కు సంబంధించి డిజిటల్‌ ప్రసార హక్కులను దక్కించుకున్న రిలయన్స్‌ ఈసారి ఐపీఎల్‌ మ్యాచ్‌ ప్రసారాలను ఉచితంగా అందించనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రిలయన్స్‌ మరో సంచలన రికార్డు నెలకొల్పినట్లే అవుతుంది. 2023 నుంచి 2027 వరకు ఐపీఎల్‌ ప్రసారాలకు సంబంధించి డిజిటల్‌ మీడియా హక్కులను రిలయన్స్‌ వెంచర్స్‌లో ఒకటైన వయాకామ్‌ 18 దక్కించుకుంటూ వచ్చింది.

ఇటీవలే ఫిఫా వరల్డ్‌ కప్‌ను జియో సినిమా యాప్‌లో ఉచితంగా రిలయన్స్ ప్రసారం చేసి సంచలనం కలిగించింది. అదే స్ట్రాటజీని ఐపీఎల్‌ మ్యాచ్‌ల విషయంలోనూ అనుసరించాలని రిలయన్స్ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. తన మార్కెట్‌ వాటాను పెంచుకోవడంలో భాగంగా ఉచితంగా లేదా చాలా తక్కువ ధరకే ప్రసారాలను అందించాలని రిలయన్స్ చూస్తోంది.

అదేవిధంగా ఐపీఎల్‌ ప్రసారాలను 11 స్థానిక భాషల్లోనూ అందించాలని జియో చూస్తోంది. దీనివల్ల టీవీల్లో వీక్షించే వారు సైతం డిజిటల్‌కు మారేందుకు ఈ ప్రణాళిక ఉపయోగపడుతుందని రిలయన్స్‌ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తోంది. 2023లో మార్చినెలలో ఐపిఎల్ ప్రసారాలు ప్రారంభం కానున్నాయి.