Kohli Records: రికార్డులు సృష్టించాలన్నా… తిరగరాయాలన్నా అది కేవలం సచిన్ టెండూల్కర్ కే సాధ్యం. అయితే అది గతం. ప్రస్తుతం రికార్డులు నెలకొల్పాలన్నా, రికార్డులు తిరగరాయాలన్నా అది టీమిండియా చిచ్చర పిడుగు విరాట్ కోహ్లీకే సాధ్యం. ఇది ముమ్మాటికీ ఒప్పుకోవాల్సిన సత్యం. ఇప్పటికే కోహ్లీ పేరిట అనేక రికార్డులు నమోదయ్యాయి. తాజాగా కోహ్లీ మరో ఫీట్ సాధించాడు.
కోల్కతా నైట్ రైడర్స్తో బుధవారం జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. కోహ్లి ఫెవరెట్ చిన్నస్వామి స్టేడియంలో ఈ ఫీట్ సాధించడం విశేషం.చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లి 3000 టీ20 పరుగుల మార్కును అధిగమించాడు. ఒక నిర్దిష్ట మైదానంలో 3000 టీ20 పరుగుల మార్క్ను దాటిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. KKRపై 37 బంతుల్లో 6 ఫోర్ల సహాయంతో 54 పరుగులు చేశాడు. మిర్పూర్లో 2989 టీ20 పరుగులు చేసిన బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ముష్ఫికర్ రహీమ్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుత ఐపీఎల్లో కోహ్లి ఐదో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. అతను KKRపై హాఫ్ సెంచరీ సాధించడానికి ముందు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు పంజాబ్ కింగ్స్లపై అర్ధసెంచరీలు చేశాడు.
కాగా.. గత రాత్రి జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంత మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిని చవిచూసింది. ముందుగా బ్యాటింగ్కు వచ్చిన KKR 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
Read More: Jagga Reddy: గాంధీ భవన్ లో ఉండలేకపోతున్నా: జగ్గారెడ్డి ఎమోషన్!