Vinesh Phogat : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ సింగ్పై వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్, బజ్రంగ్ పునియా తదితర రెజ్లర్లు తీవ్ర పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో బ్రిజ్భూషణ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ ఎన్నికైనందుకు నిరసనగా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె చెప్పిన విధంగానే చేశారు. తనకు వచ్చిన జాతీయ క్రీడా అవార్డులను వెనక్కి ఇచ్చేశారు. శనివారం ఢిల్లీలోని కర్తవ్యపథ్ మార్గంలో అర్జున అవార్డు, ఖేల్రత్న అవార్డులను వినేశ్ వదిలేసి వెళ్లారు. తొలుత వినేశ్ తన అవార్డులను ప్రధానమంత్రి కార్యాలయం వెలుపల వదిలిపెట్టేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో కర్తవ్యపథ్ మార్గం వద్దే ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వినేశ్ అవార్డులను కర్తవ్యపథ్ మార్గంలోనే విడిచి వెళ్లిపోయారు. బజరంగ్ పునియా కూడా తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశాడు. కర్తవ్యపథ్ మార్గంలోనే తనకు వచ్చిన అవార్డును వదిలివెళ్లాడు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘ఏ క్రీడాకారుడి జీవితంలో కూడా ఇలాంటి రోజు రాకూడదు. దేశంలోని మహిళా రెజ్లర్లు చాలా కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు’’ అని పేర్కొంటూ వినేశ్(Vinesh Phogat) కర్తవ్యపథ్కు వస్తున్న ఒక వీడియోను బజరంగ్ పునియా ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్గా సంజయ్ సింగ్ ఎన్నికైనందుకు.. తాను రెజ్లింగ్ నుంచి వైదొలుగుతానని సాక్షి మలిక్ ప్రకటించింది. బధిరుల ఒలింపిక్స్ పసిడి విజేత వీరేందర్ సింగ్ యాదవ్ కూడా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించాడు. కాగా, డబ్ల్యూఎఫ్ఐ కొత్త ప్యానెల్ను కూడా కేంద్ర క్రీడా శాఖ ఇటీవల సస్పెండ్ చేసింది.