Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ 2026లో తమ తదుపరి మ్యాచ్ను కోల్కతా నైట్ రైడర్స్తో ఏప్రిల్ 19న ఈడెన్ గార్డెన్స్లో ఆడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి టీమ్ తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. ఈ పోరులో రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి ఒక భారీ రికార్డు సృష్టించే అవకాశం ఉంది. సూర్యవంశీ గనుక ఈ మ్యాచ్లో సెంచరీ బాదితే చరిత్ర సృష్టిస్తాడు. అదే సమయంలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ రికార్డును కూడా బద్దలు కొడతాడు.
వైభవ్ సూర్యవంశీ ముందు చరిత్ర సృష్టించే అవకాశం
రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాటర్గా నిలిచే సువర్ణావకాశం ఉంది. ప్రస్తుతం ఈ రికార్డు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ పేరు మీద ఉంది. పడిక్కల్ కేవలం 25 ఇన్నింగ్స్ల్లోనే 1000 టీ20 పరుగులు సాధించాడు. మరోవైపు సూర్యవంశీ ఇప్పటివరకు 23 ఇన్నింగ్స్ల్లో 901 పరుగులు చేశాడు. ఒకవేళ కోల్కతా నైట్ రైడర్స్పై సూర్యవంశీ సెంచరీ చేస్తే అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా పేరు నిలిచిపోతుంది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన గత మ్యాచ్లో సూర్యవంశీ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అందుకే ఈ మ్యాచ్లో ఆ లోటును భర్తీ చేయాలని వైభవ్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యవంశీ ఈ సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్ల్లో 200 పరుగులు చేశారు.
Also Read: Allu Arjun: వ్యక్తిగత హక్కుల కోసం హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
కోల్కతా పిచ్పై లభించనున్న సహకారం
ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో వైభవ్ సూర్యవంశీ అక్కడ అద్భుత ప్రదర్శన చేసే అవకాశం ఉంది. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ప్రస్తుతం చాలా పేలవమైన ప్రదర్శన చేస్తోంది. ఈ ఫ్రాంచైజీ బౌలర్లు తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. వైభవ్ గనుక కేకేఆర్పై 100 పరుగులు చేస్తే ఆరెంజ్ క్యాప్ రేసులో కూడా అగ్రస్థానానికి చేరుకుంటాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుతం ఈ సీజన్లో చాలా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఆ జట్టు ఆడిన 5 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించింది.
