వెస్టిండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్కు భారత్ అంటే ప్రత్యేకమైన అభిమానం అని చెప్పొచ్చు. ఈ విషయాన్ని ఇంతకముందు గేల్ చాలా సందర్బాల్లో వెల్లడించాడు. ఇక ఐపీఎల్ ద్వారా క్రిస్ గేల్ భారత క్రికెట్ అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. అయితే ఐపీఎల్ 2022 సీజన్ లో మాత్రం గేల్ ఆడడం లేదు. అంతకుముందు ఐపీఎల్ మెగావేలానికి సంబంధించి ప్లేయర్ల వేలం జాబితాలో గేల్ రిజిస్టర్ చేసుకోలేదు. ఈ కారణంగా 43 ఏళ్ళ గేల్ వేలానికి అలాగే మెగా టోర్నీకి దూరమయ్యాడు.
అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేశాడు క్రిస్ గేల్. ఐపీఎల్ 2023 సీజన్ కోసం ఇప్పటినుంచే సిద్ధమవుతున్నట్లు వెల్లడించాడు. రాబోయే ఐపీఎల్ కోసం ఫిట్నెస్పై దృష్టిసారించినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలోనే జిమ్లో చెమటలు వచ్చేలా కసరత్తులు చేస్తున్నాడు. ఇక ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్కు ఆడాడు. దీనిలో ఆర్సీబీ తరపున 91 మ్యాచ్ల్లో 3420 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లి, ఎబి డివిలియర్స్ తర్వాత ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా గేల్ నిలిచాడు. ఇక తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తంగా 142 మ్యాచ్లు ఆడిన గేల్ .. 4965 పరుగులు చేశాడు. అందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. ఇక క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్ తరపున 103 టెస్టులు, 301 వన్డేలు, 79 టి20లు ఆడాడు.