Wimbledon Prize Money: ఈ నెల చివరిలో ప్రారంభమయ్యే ఈ ఏడాది మూడవ గ్రాండ్స్లామ్ వింబుల్డన్ ప్రైజ్మనీ రికార్డు స్థాయిలో పెంపు జరిగింది. ఈ సారి మొత్తం ప్రైజ్మనీని 53.5 మిలియన్ పౌండ్లు (సుమారు 622.6 కోట్ల రూపాయలు)కు పెంచారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 7 శాతం ఎక్కువ. గత దశాబ్దంతో పోలిస్తే రెట్టింపు. ఈ సంవత్సరం వింబుల్డన్ జూన్ 30 నుంచి జులై 13 వరకు జరుగుతుంది.
ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్ (AELTC) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంవత్సరం పురుషులు, మహిళల సింగిల్స్ ఛాంపియన్లకు రికార్డు స్థాయిలో 3 మిలియన్ పౌండ్లు (సుమారు 34.89 కోట్ల రూపాయలు) ప్రైజ్మనీ ఇవ్వనున్నారు. ఇది నాలుగు గ్రాండ్స్లామ్లలో అత్యధికం. ఇది గత సంవత్సరం పురుషుల ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్, మహిళల ఛాంపియన్ బార్బోరా క్రెజ్సికోవాకు లభించిన ప్రైజ్ మనీతో పోలిస్తే 11.1% ఎక్కువ.
మొదటి రౌండ్లో ఓడిపోయిన ఆటగాళ్లకు కూడా గణనీయమైన ప్రైజ్మనీ లభించనుంది. వారికి ఇప్పుడు 66,000 పౌండ్లు (సుమారు 76 లక్షల రూపాయలు) ఇవ్వనున్నారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 10% ఎక్కువ. ఇంకా డబుల్స్లో 4.4%, మిక్స్డ్ డబుల్స్లో 4.3%, వీల్చైర్ విభాగంలో 5.6% పెంపు చేసినట్లు ప్రకటించారు.
Also Read: PM Modi : అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రధాని సమీక్ష.. విజయ్ రూపానీ ఫ్యామిలీని పరామర్శించనున్న మోడీ
AELTC చైర్పర్సన్ డెబోరా జీవన్స్ మాట్లాడుతూ.. “మేము ఆటగాళ్ల మాట విన్నాం. వారితో చర్చలు జరిపాం. అయితే, ప్రైజ్మనీని పెంచడం మాత్రమే పరిష్కారం కాదు. ఆటగాళ్లకు ఆఫ్-సీజన్ లభించడం లేదు. గాయాలు పెరుగుతున్నాయి. ఇది పెద్ద సవాల్” అని అన్నారు.
ఫైనల్ ఇప్పుడు సాయంత్రం 4 గంటల నుంచి
వింబుల్డన్లో ఈ సారి మరో పెద్ద మార్పు జరిగింది. పురుషులు , మహిళల సింగిల్స్ ఫైనల్ స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే డబుల్స్ ఫైనల్ మధ్యాహ్నం 1 గంట నుంచి ఆడనున్నారు. AELTC సీఈఓ సాలీ బోల్టన్ మాట్లాడుతూ.. ఈ సమయ మార్పు ఆటగాళ్లకు, అభిమానులకు, టీవీ వీక్షకులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుందని అన్నారు. “ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ 5 గంటల 29 నిమిషాల పాటు సాగింది. అందుకే సమయాన్ని కొత్తగా నిర్ణయించడం అవసరమైంది. తద్వారా వీక్షకులకు పూర్తి అనుభవం లభిస్తుంది. ఛాంపియన్ను విస్తృత ప్రేక్షకుల ముందు గుర్తించవచ్చు” అని ఆమె అన్నారు.
మొదటిసారిగా లైన్ జడ్జ్లు లేరు
ఈ సంవత్సరం టోర్నమెంట్ మరో పెద్ద సంప్రదాయాన్ని భగ్నం చేస్తూ లైన్ జడ్జ్లు లేకుండా జరుగుతుంది. వారి స్థానంలో ఇప్పుడు ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్ సిస్టమ్ ఉపయోగించబడుతుంది. ఇది ఇప్పటికే అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లలో అనుసరిస్తున్నారు. అనేక మంది మాజీ లైన్ జడ్జ్లు ఇప్పుడు ‘మ్యాచ్ అసిస్టెంట్’ పాత్రలో కనిపిస్తారని, వీరు చైర్ అంపైర్కు అదనపు సహాయం అందిస్తారని ప్రకటించారు. టోర్నమెంట్ అంతటా సుమారు 80 మంది అసిస్టెంట్లు ఉంటారు. వీరు సాంకేతిక సమస్యల సమయంలో కూడా ఉపయోగపడతారు.
నాలుగు గ్రాండ్స్లామ్లలో ప్రైజ్ మనీ
- ఆస్ట్రేలియన్ ఓపెన్: 17.5 కోట్ల రూపాయలు
- ఫ్రెంచ్ ఓపెన్: 21.5 కోట్ల రూపాయలు
- వింబుల్డన్: 35 కోట్ల రూపాయలు
- యూఎస్ ఓపెన్: 25 కోట్ల రూపాయలు