అహ్మదాబాద్ టెస్టుకు సిద్ధమవుతున్న భారత జట్టు (TeamIndia) బిజీబిజీగా ఉంది. ఇండోర్లో ఓటమి తర్వాత అహ్మదాబాద్ టెస్టులో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని టీమిండియా ఆటగాళ్లు భావిస్తున్నారు. ఈ కారణంగానే జట్టు మొత్తం తదుపరి మ్యాచ్కు సిద్ధమవుతున్నారు. కాగా, టీమ్ బస్సులోనే ఆటగాళ్లు హోలీ (Holi) సంబరాలు చేసుకున్నారు. భారత జట్టు ఓపెనర్ శుభ్మన్ గిల్ హోలీ వేడుకల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆస్ట్రేలియాతో నాల్గవ, చివరి టెస్టుకు ముందు నరేంద్ర మోడీ స్టేడియంకు వెళ్తున్న బస్సులో భారత క్రికెట్ జట్టు హోలీ ఆడింది. ఆటగాళ్లు ఒకరికి ఒకరు రంగులు పూసుకున్నారు.
గిల్ షేర్ చేసిన వీడియోలో విరాట్ కోహ్లీ ముందంజలో హోలీ సంబరాలు చేసుకుంటున్నాడు. కమ్ డౌన్, రాంగ్ బర్సే పాటలపై డ్యాన్స్ చేస్తున్నాడు. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ అతనిపై వెనుక నుంచి రంగు విసురుతున్నాడు. శ్రేయాస్ అయ్యర్తో సహా జట్టులోని ఆటగాళ్లందరూ రంగులు పూసుకుని ఉన్నారు. జట్టులోని సహాయక సిబ్బంది కూడా హోలీని ఉత్సాహంగా జరుపుకున్నారు. భారత జట్టు హోలీ జరుపుకుంటున్న వీడియోను కూడా ఇషాన్ కిషన్ పంచుకున్నాడు. అందులో ఆటగాళ్లందరూ కేకలు వేస్తూ హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ వీడియోలో కూడా ఆటగాళ్లందరూ కలర్ఫుల్గా కనిపిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ అందరికీ హోలీ శుభాకాంక్షలు అని ఇషాన్ రాశాడు. శుభమాన్ గిల్ భారత జట్టు నుండి హ్యాపీ హోలీ అని రాశాడు.
Also Read: Gold And Silver Price Today: పసిడి ధరలకు బ్రేక్.. దేశ వ్యాప్తంగా నేటి ధరలివే..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగో, చివరి టెస్టు మ్యాచ్ మార్చి 9 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్లో ప్రస్తుతం భారత్ 2-1తో ముందంజలో ఉంది. అహ్మదాబాద్లో జరిగే టెస్టు మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా భారత జట్టు సిరీస్ గెలవాలని చూస్తుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భారత్ ఫైనల్కు చేరుకుంటుంది.