Rohit Sharma ate soil : టీమ్ఇండియా (Team India) మరో సారి విశ్వవిజేతగా నిలిచింది. బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా 17 ఏళ్ల తరువాత మరోసారి పొట్టి ప్రపంచకప్(T20 World Cup)ను ముద్దాడింది. 11 ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న ఐసీసీ ట్రోఫీని అందుకోవడంతో ఆటగాళ్లు భావోద్వేగానికి లోనైయ్యారు. యావత్ భారత్ సంబరాలు చేసుకుంది. అయితే.. మ్యాచ్ గెలవగానే టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన పని ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మ్యాచ్ గెలవగానే రోహిత్ శర్మ మైదానంలో అలాగే బోర్లా పడుకుని సాధించాం అంటూ తన చేతిని మైదానంలో పలు మార్లు కొట్టాడు. ఆ తరువాత పిచ్ వద్దకు వచ్చిన హిట్మ్యాన్ పిచ్ పై ఉన్న మట్టిని కాస్త చేతితో తీసుకుని తిన్నాడు. రోహిత్ మట్టిని తినడం చూసిన పలువురు ఆశ్చర్యపోయారు. దీనిపై నెట్టింట ఒక్కొక్కరు ఒక్కొ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తాను మట్టిని ఎందుకు తిన్నాను అనే విషయం పై కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టత ఇచ్చాడు. ఈ మైదానంలో మనం విశ్వవిజేతలుగా నిలిచామని, ఈ గ్రౌండ్ను, పిచ్ను తన జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పాడు. ఇలాంటి చారిత్రాత్మక విజయాన్ని అందించిన పిచ్ను తనలో భాగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆ మట్టిని తిన్నట్లుగా రోహిత్ తెలిపాడు.
Also Read: Foods Avoid Empty Stomach: అలర్ట్.. ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తినకూడదట..!
ప్రపంచకప్ను గెలిచామనే విషయాన్ని తాను ఇంకా నమ్మలేకపోతున్నానని అన్నాడు. ఫైనల్ మ్యాచ్ ముగిసి రెండు రోజులు దాటినప్పటికి కూడా ఇంకా ఓ కలలా ఉందన్నాడు. ఫైనల్ మ్యాచ్ గెలిచిన రోజు తెల్లవారుజాము వరకు సంబరాలు చేసుకున్నట్లుగా వివరించాడు. తన జీవితంలో ప్రపంచకప్ గెలవడం ఎంతో ప్రత్యేకమైందని, ఈ విజయాన్ని తాము ఇంకా పూర్తిగా ఆస్వాదించలేదన్నాడు.
ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (79) హాఫ్ సెంచరీ బాదగా అక్షర్ పటేల్ (47), శివమ్ దూబె (27) లు రాణించారు. అనంతరం భారత బౌలర్లు విజృంభించడంతో దక్షిణాఫ్రికా లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమైంది. టీమ్ఇండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు తీశాడు. అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ ఓ వికెట్ సాధించారు.