న్యూజిలాండ్ టూర్ లో టీట్వంటీ సీరీస్ గెలిచేందుకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. రెండో టీట్వంటీలో ఆతిథ్య జట్టును చిత్తు చేసిన భారత్ ఫుల్ జోష్ లో ఉంది. మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి టీ20 వర్షంతో తుడిచిపెట్టుకుపోగా.. రెండో మ్యాచ్లో భారత్ 65 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. కీలక మూడో టీ20లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు భావిస్తోంది. ఈ మ్యాచ్ కు భారత తుది జట్టులో ఎక్కువ మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. ఓపెనర్ గా పంత్ కు మరో ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. దీంతో మరో వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు నిరాశే మిగిలనుంది. గత మ్యాచ్ లోనే సంజూకి అవకాశం ఇవ్వకపోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ టీమ్ మేనేజ్ మెంట్ మాత్రం పంత్ వైపే మొగ్గు చూపుతోంది.
ఇదిలా ఉంటే సూర్య కుమార్ యాదవ్ సూపర్ ఫామ్ జట్టుకు అడ్వాంటేజ్. అయితే మిగిలిన వారు కూడా రాణించాల్సి ఉంటుంది. అలాగే
జట్టులో ఫినిషర్ రోల్ ఎవరిదనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు తుది జట్టులో ఉమ్రాన్ మాలిక్ కు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మ్యాచ్ లో భువీ, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేయగా.. అర్ష్దీప్ మాత్రం ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఏకైక స్పిన్నర్గా చాహల్ కొనసాగనున్నాడు. ఇక సీరీస్ చేజారకుండా ఉండాలంటే కివీస్ కు ఈ మ్యాచ్ లో విజయం తప్పనిసరి. గత మ్యాచ్ లో పెద్దగా పోటీ ఇవ్వలేక పోయిన ఆతిథ్య జట్టు ఎలా ఆడుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.