Site icon HashtagU Telugu

T20 World Cup: భారత్-పాక్ మ్యాచ్ జరిగే సమయం ఎప్పుడో తెలుసా ?

T20 World Cup

T20 World Cup

T20 World Cup: భారత్‌-పాకిస్థాన్ క్రికెట్‌ మ్యాచ్‌ అంటేనే నరాలు తెగే ఉత్కంఠ. ప్రపంచకప్ లాంటి ప్రతిష్టాత్మ క టోర్నీల్లో ఇరు జట్లు తలపడితే అది ఇంకాస్త పెరుగుతుంది. ఇరు దేశాల అభిమానుల్లో భావోద్వేగం కట్టలు తెంచుకుంటుంది. గత ప్రపంచకప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచుల్లో పాక్ ను భారత్ చిత్తూ చేసింది. ముఖ్యంగా పాక్ పై కోహ్లీ భీభత్సం సృష్టిస్తాడు.

త్వరలో టి20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. పైగా టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో పాక్‌పై భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటికే టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 1 నుంచి టోర్నీ ప్రారంభమై ఫైనల్ మ్యాచ్ జూన్ 29న ముగుస్తుంది. అమెరికా, వెస్టిండీస్‌ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. ఈ 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించగా పాక్, భారత్ ఒకే గ్రూపులో ఉండటం విశేషం. 2007లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా పాకిస్థాన్‌ను ఓడించి తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఇప్పుడు రోహిత్ సారధ్యంలో టి20 ప్రపంచకప్ గెలుస్తుందన్న ధీమా వ్యక్తమవుతోంది.

గత ప్రపంచకప్ లో ఓటమికి బదులు తీర్చుకునేందుకు ఈ టోర్నీని అవకాశంగా మలుచుకునేందుకు యువభారత్ సిద్దమవుతుంది. తాజాగా టి20 ప్రపంచకప్ సమయాన్ని కూడా ప్రకటించారు. భారత్ , యూఎస్‌ఏ మధ్య పదిన్నర గంటల సమయ వ్యత్యాసం ఉంది. దీంతో టీమ్ ఇండియా మ్యాచ్‌లన్నీ రాత్రి 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జూన్‌ 9న హైవోల్టేజీ మ్యాచ్ జరగనుంది. ఆదివారం జరగనున్న మ్యాచ్‌కు న్యూయార్క్‌లోని కొత్త స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

Also Read: IND vs ENG: రెచ్చిపోయిన యార్కర్ కింగ్ బుమ్రా.. వీడియో వైరల్