Site icon HashtagU Telugu

Eng Win 3rd T20: సూర్యకుమార్ సెంచరీ వృథా..ఇంగ్లాండ్ దే చివరి టీ ట్వంటీ

Surya Kumar

Surya Kumar

పరుగుల వరద పారిన మూడో టీ ట్వంటీలో ఇంగ్లాండ్ దే పై చేయిగా నిలిచింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన భారీ టార్గెట్ ను చేదించే క్రమంలో సూర్యకుమార్ సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. భారత్ జట్టు 17 రన్స్ తేడాతో పరాజయం పాలైంది.
మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది.

సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ లేకపోవడంతో తొలి ఓవర్ నుంచే ఎదురు దాడికి దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు సక్సెస్ అయ్యారు. వేగంగా ఆడే క్రమంలో వరుస వికెట్లు కోల్పోయినా ఇంగ్లాండ్ స్కోర్ వేగం తగ్గలేదు. ఓవైపు వికెట్లు పడుతున్నా డేవిడ్ మలాన్ మాత్రం ధాటిగా ఆడాడు.కేవలం 30 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడు బ్యాటింగ్ మెరుపులతో ఇంగ్లాండ్ 12 ఓవర్లలోనే వంద పరుగులు దాటింది.

చివర్లో లివింగ్ స్టోన్ కూడా రెచ్చిపోవడంతో ఇంగ్లాండ్ 215 పరుగులు చేసింది. మలాన్‌ 77 , లివింగ్‌స్టోన్‌ 42 నాటౌట్‌ రాణించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ తలో రెండు వికెట్లు, ఉమ్రాన్ మాలిక్, ఆవేష్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రిషబ్‌ పంత్‌ 1 పరుగు చేసి ఔటయ్యాడు. రోహిత్‌ శర్మ , విరాట్‌ కోహ్లి కూడా విఫలమయ్యారు. దీంతో భారత్ 31 రన్స్ కే 3 వికెట్లు చేజార్చుకుంది. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ , శ్రేయాస్ అయ్యర్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 119
పరుగులు జోడించారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్య కుమార్ యాదవ్ బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 32 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో ఫిఫ్టి పూర్తి చేసుకున్న స్కై ఆ తర్వాత మరింత ధాటిగా ఆడాడు. మరో 16 బంతుల్లోనే తర్వాతి ఫిఫ్టీ అందుకున్నాడంటే అతని జోరు అర్థం చేసుకోవచ్చు.

అయితే మిగిలిన బ్యాటర్లు నుంచి సపోర్ట్ లేకపోవడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. చివరికి టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులే చేయగలిగింది. సూర్య కుమార్ యాదవ్ 55 బంతుల్లో 14 ఫోర్లు , 6 సిక్సర్లతో 117 రన్స్ కు ఔటయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో టాప్లీ 3 , డేవిడ్ విల్లీ 2 వికెట్లు పడగొట్టారు. మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత్‌ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Pic: BCCI/Twitter