టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ (SuryaKumar Yadav) టీ ట్వంటీ ఫార్మాట్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఇప్పటికే గ్రౌండ్ లో పరుగుల వరద పారిస్తున్న సూర్యా భాయ్.. తాజాగా ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో అరుదైన రికార్డు సాధించాడు. తొలిసారి 900 రేటింగ్ పాయింట్లు మార్క్ అందుకున్న భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో 908 రేటింగ్ పాయింట్స్ సాధించి, పొట్టి ఫార్మాట్లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.
ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 45 బంతుల్లోనే విధ్వంసకర శతకం బాదిన సూర్యకుమార్.. తొలిసారి 900 రేటింగ్ పాయింట్స్ మార్కును దాటాడు. టీ20 ర్యాంకింగ్స్ చరిత్రలో డేవిడ్ మలాన్, ఆరోన్ ఫించ్లు మాత్రమే 900 రేటింగ్ పాయింట్స్ను సాధించగా.. తాజాగా స్కై వీరిద్దరి సరసన చేరాడు. గతంలో ఏ భారత క్రికెటర్ కూడా ఈ ఘనత సాధించలేదు. తాజా ర్యాంకింగ్స్లో స్కై తర్వాత పాకిస్తాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ 836 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత డెవాన్ కాన్వే, బాబర్ ఆజమ్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మలాన్, గ్లెన్ ఫిలిప్స్, రిలీ రొస్సో, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్ వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు.
Also Read: IND vs SL 2nd ODI: భారత్, శ్రీలంక రెండో వన్డే నేడు.. సిరీస్ పై టీమిండియా కన్ను
ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 631 రేటింగ్ పాయింట్స్తో 13వ ప్లేస్లో నిలిచాడు. టాప్-20లో టీమిండియా తరఫున స్కై, విరాట్లు మాత్రమే ఉన్నారు. ఇప్పటివరకు 45 టీ ట్వంటీలు ఆడిన సూర్య.. 46.41 సగటు, 180.34 స్ట్రయిక్ రేట్తో 1578 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత ఏడాది కాలంగా షార్ట్ ఫార్మాట్ లో సూర్య అదరగొడుతున్నాడు. అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కొద్ది కాలంలోనే నెంబర్ వన్ బ్యాటర్ గా నిలిచాడు.