Sunrisers Team: మెగా వేలానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Team) 5 మంది ఆటగాళ్లను ఉంచుకుంది. అందులో నితీష్ కుమార్ రెడ్డి పేరు కూడా చేర్చబడింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్లో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి మెల్బోర్న్లో సూపర్ సెంచరీ సాధించి కంగారూ బౌలర్లను చీల్చి చెండాడు. ఇదిలా ఉండగా త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నీలో నితీష్ పై భారీ అంచనాలు నమోదయ్యాయి. నితీష్ సెంచరీతో సన్ రైజర్స్ జట్టు యాజమాన్యం సంబరపడిపోతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్లో ఎలాగైతే గేమ్ చేంజర్ గా మారాడో , వచ్చే సీజన్లో టోర్నీ చేంజర్ గా మారుతాడని ఆ జట్టు భావిస్తుంది.
మెగావేలంలో నితీష్ కుమార్ రెడ్డిని సన్రైజర్స్ హైదరాబాద్ 6 కోట్లకు అట్టిపెట్టుకుంది. గత రెండు సీజన్లలో రూ.20 లక్షలు జీతం ఇవ్వగా, ఆ సీజన్లలో నితీష్ మంచి ఫలితాలను రాబట్టడంతో వచ్చే సీజన్ కోసం భారీ మొత్తం చెల్లించి అతడిని తన వద్దే ఉంచుకుంది. నితీష్ కుమార్ రెడ్డి ఐపిఎల్లో ఇప్పటివరకు మొత్తం 15 మ్యాచ్లు ఆడాడు. గత సీజన్లో 142.92 స్ట్రైక్ రేట్తో 303 పరుగులు చేశాడు. అదే సమయంలో 3 వికెట్లు కూడా తీశాడు. ప్రస్తుతం మెల్బోర్న్లో నితీష్ సెంచరీ చేసిన తీరు క్రికెట్ కారిడార్లలో చర్చనీయాంశమైంది. ఇది మాత్రమే కాక గత మూడు మ్యాచ్ లలోను నితీష్ రాణించాడు. ఇప్పుడు అతని ఫామ్ను చూసి హైదరాబాద్ జట్టు తెగ సంతోషిస్తుంది. గత సీజన్లో తృటిలో చేజారిన టైటిల్ వచ్చే సీజన్లో మిస్ అయ్యే ఛాన్స్ లేదని యాజమాన్యం భావిస్తుంది.
Also Read: Anushka Sharma: అనుష్క శర్మతో నితీష్ కుమార్ రెడ్డి కుటుంబం!
మెల్బోర్న్ టెస్టు విషయానికి వస్తే..నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మైదానంలోకి వచ్చేసరికి టీమ్ ఇండియా కష్టాల్లో కూరుకుపోయి ఉంది. ఈ పరిస్థితుల్లో జట్టు బాధ్యతను తీసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్తో కలిసి 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి 171 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. అటు సుందర్ కూడా నితీష్ కు అద్భుత సహకారం అందించి తాను కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.