జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terrorist attack) దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. ఈ అమానవీయ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం భారత ప్రజల మనసులను కలిచివేసింది. ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర స్పందనలు వెల్లువడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా అనేకరాష్ట్ర నాయకులు, క్రీడాకారులు, కళాకారులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దేశమంతా బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) ఈ దాడిపై ఘాటుగా స్పందించారు.
BRS Silver Jubilee: ఒక ‘క్షతగాత్రుడి’ రజతోత్సవం !!
బెంగళూరులో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ అనంతరం కామెంటరీ ప్యానెల్లో గావస్కర్ మాట్లాడుతూ.. ఈ దాడిని పిరికిపనిగా, మానవత్వాన్ని తాకట్టు పెట్టిన చర్యగా పేర్కొన్నారు. “ఈ ఘటన దేశంలోని ప్రతి ఒక్కరినీ కలచివేసింది. పర్యాటకులపై దాడిచేయడం వల్ల ఏ లాభమూ ఉండదు. గత 78 ఏళ్లుగా ఒక్క మిల్లీమీటర్ భూమినైనా కదిలించలేకపోయారు. ఇకపై 78 వేల సంవత్సరాలు గడిచినా అది సాధ్యం కాదు” అంటూ గావస్కర్ హెచ్చరించారు. ఇలాంటి దాడులు మానవత్వానికి విరుద్ధమైనవని, శాంతిని పక్కనపెట్టి అశాంతికి దారితీసే మార్గాన్ని ఎంచుకోవడం అభ్యుదయానికి అడ్డు వేయడమే అని గావస్కర్ స్పష్టం చేశారు. “భారతదేశం మరింత దృఢంగా ముందుకు సాగుతోంది. దాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు ఎప్పటికీ విఫలమే. అలాంటి సమయంలో దేశ ప్రజలంతా ఒక్కటిగా ఉండాలని, బాధ్యతతో ముందుకెళ్లాలని” ఆయన పిలుపునిచ్చారు. గావస్కర్ మాటలు ప్రతి భారతీయుడిలో దేశభక్తిని, ఏకత్వాన్ని మరింత పెంపొందించాయి.