Lasith Malinga: 2026 టీ20 ప్రపంచకప్కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక జట్టులోకి దిగ్గజ బౌలర్ లసిత్ మలింగ మళ్ళీ ప్రవేశించారు. జట్టు ఫాస్ట్ బౌలింగ్ సలహాదారుగా మలింగను నియమించారు. అయితే ప్రస్తుతానికి ఆయనకు డిసెంబర్ 15 నుండి జనవరి 25 వరకు మాత్రమే ఈ బాధ్యతలను అప్పగించారు. ప్రపంచకప్ కోసం శ్రీలంక బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేయడమే మలింగ ప్రధాన లక్ష్యమని దీని ద్వారా స్పష్టమవుతోంది. 2026 టీ20 ప్రపంచకప్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మలింగ కెప్టెన్సీలోనే 2014లో శ్రీలంక విశ్వవిజేతగా నిలిచింది.
శ్రీలంక శిబిరంలో మలింగ ఎంట్రీ
టీ20 ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకరైన లసిత్ మలింగ. 2026 ప్రపంచకప్ కోసం శ్రీలంక బౌలింగ్కు పదును పెట్టనున్నారు. మలింగ అంతర్జాతీయ కెరీర్ అద్భుతంగా సాగడమే కాకుండా ముంబై ఇండియన్స్ జట్టుకు కోచ్గా కూడా ఆయన మంచి ఫలితాలను సాధించారు. అందుకే శ్రీలంక బోర్డు మలింగ అనుభవాన్ని ఉపయోగించుకుని, ముఖ్యంగా ‘డెత్ ఓవర్ల’ బౌలింగ్ను బలోపేతం చేయాలని భావిస్తోంది.
Also Read: సీఎం రేవంత్ పాలనలో స్థిరత్వం నుంచి స్మార్ట్ డెవలప్మెంట్ దిశగా తెలంగాణ!
ఐర్లాండ్తో తొలి సమరం
టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక తన తొలి మ్యాచ్ను కొలంబో వేదికగా ఐర్లాండ్తో ఆడనుంది. శ్రీలంక గ్రూప్-బిలో ఉంది. ఈ గ్రూప్లో ఐర్లాండ్, ఒమన్, ఆస్ట్రేలియా, జింబాబ్వే జట్లు ఉన్నాయి.
- ఫిబ్రవరి 8: ఐర్లాండ్తో మొదటి మ్యాచ్.
- ఫిబ్రవరి 12: ఒమన్తో తలపడుతుంది.
- ఫిబ్రవరి 16: ఆస్ట్రేలియాతో కీలక పోరు.
- ఫిబ్రవరి 19: జింబాబ్వేతో గ్రూప్ దశలో చివరి మ్యాచ్.
శ్రీలంక తన గ్రూప్ దశ మ్యాచ్లన్నీ సొంత గడ్డపైనే ఆడనుంది. ఇది ఆ జట్టుకు పెద్ద సానుకూలాంశం. ఈ మెగా టోర్నీ కోసం శ్రీలంక జట్టు పగ్గాలను దాసున్ శనకకు అప్పగించారు. వానిందు హసరంగ, మతీష పతిరణ, దుష్మంత చమీర, మహేష్ తీక్షణ వంటి స్టార్ ఆటగాళ్లతో శ్రీలంక జట్టు ప్రస్తుతం చాలా బలంగా కనిపిస్తోంది.
