Smriti Mandhana: టీమ్ ఇండియా మహిళల జట్టుకు ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన సూపర్స్టార్ బ్యాట్స్వుమన్ స్మృతి మంధాన (Smriti Mandhana) తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. మంధాన త్వరలో సంగీత స్వరకర్త అయిన పలాష్ ముచ్ఛల్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. నవంబర్ 23వ తేదీన వారి వివాహ వేడుక జరగనుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా క్రీడా, సినీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం స్మృతి మంధాన పెళ్లికి సంబంధించిన అంచనాలు, అతిథుల జాబితా గురించి సోషల్ మీడియాలో, మీడియా వర్గాలలో ఊహాగానాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ‘రో-కో’ (రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ) వంటి భారత క్రికెట్ పురుషుల జట్టు దిగ్గజాలు కూడా ఈ వేడుకకు హాజరు కాబోతున్నారనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి.
Also Read: Delhi Blast: ఢిల్లీ బాంబు బ్లాస్ట్.. మరో కొత్త విషయం వెలుగులోకి!
మంధాన పెళ్లి వేడుకపై ఆమె సహచర కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ స్పందించారు. ఒక ప్రముఖ క్రీడా పోర్టల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్మన్ప్రీత్ మాట్లాడుతూ.. స్మృతి వివాహం జట్టు మొత్తానికి ఒక ప్రత్యేక సందర్భం అని వెల్లడించారు. “మేమంతా ఒకరినొకరు కలుసుకోవడాన్ని చాలా మిస్ అవుతుంటాం. ఏదైనా టోర్నమెంట్ ముగియగానే మళ్లీ ఎప్పుడు కలుస్తామా అని ఆలోచిస్తాం. స్మృతి పెళ్లి మా అందరికీ ఒక అద్భుతమైన అవకాశం. ఇక్కడ జట్టు మొత్తం మళ్లీ కలిసి కనిపిస్తుంది” అని హర్మన్ప్రీత్ ఉద్వేగంగా తెలిపారు. ఈ వ్యాఖ్యలు భారత మహిళా క్రికెటర్ల మధ్య ఉన్న బంధాన్ని, స్మృతి పెళ్లి పట్ల వారికి ఉన్న ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
మహిళా జట్టుతో పాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలాష్ ముచ్ఛల్ స్నేహితులు, సహచరులు కూడా ఈ వివాహానికి హాజరుకానున్నారు. దీంతోపాటు పురుషుల క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అలాగే మరికొంతమంది ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించే అవకాశం ఉందని తెలుస్తోంది.
