Dhoni and Pandya: షోలే 2 కమింగ్ సూన్ : హార్దిక్ పాండ్య

ధోనీ హోమ్ టౌన్ కావడంతో భారత్ టీ ట్వంటీ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య ప్రత్యేకంగా అతన్ని కలవడానికి ధోనీ ఇంటికి వెళ్లాడు.

  • Written By:
  • Updated On - January 26, 2023 / 04:21 PM IST

న్యూజిలాండ్ తో వన్డే సీరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు షార్ట్ ఫార్మాట్ కు రెడీ అయింది. శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి టీ ట్వంటీ జరగనుంది. రాంచీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం రెండు జట్లూ అక్కడికి చేరుకున్నాయి. ధోనీ హోమ్ టౌన్ కావడంతో భారత్ టీ ట్వంటీ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్య ప్రత్యేకంగా అతన్ని కలవడానికి ధోనీ ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా ట్విటర్ లో అతడు షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. షోలేలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలాగా ఓ బైక్ పై హార్దిక్, ధోనీ ఆ ఫోటోలో కూర్చున్నారు. ఈ ఫొటోకు హర్దిక్ షోలే 2 కమింగ్ సూన్ అనే క్యాప్షన్ ఉంచాడు. ధోనీకి ఖరీదైన బైకులు అంటే ఎంతో ఇష్టమనీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అతని ఇంట్లో ఎన్నో బైకులు, కార్లు ఉండగా… వాటిలో ఈ బైక్ కూడా ఒకటిగా కనిపిస్తోంది. సైడ్ కారుతో ఉన్న ఈ బైక్ కూడా చాలా ఖరీదైనదే. మోడర్న్ బైక్ లతోపాటు వింటేజ్ బైక్ లను సేకరించడం కూడా ధోనీకి అలవాటు. ఇప్పుడు అదే బైక్ పై ఇద్దరూ ఫొటోకు ఫోజ్ ఇచ్చారు. ధోనీతో హార్దిక్ కు మంచి అనుబంధం ఉంది. గతేడాది కూడా ఓ బర్త్ డే పార్టీలో ధోనీతో కలిసి హార్దిక్ స్టెప్పులేసిన వీడియో వైరల్ అయింది. ధోనీ ఇచ్చిన చిన్న సలహా వల్లే తన కెరీర్ మారిపోయిందని గతంలో హార్దిక్ చెప్పాడు.

ఇదిలా ఉంటే కివీస్ తో టీ ట్వంటీ సీరీస్ కు కూడా రోహిత్ శర్మ, కోహ్లీ లను బీసీసీఐ ఎంపిక చేయలేదు. టీ ట్వంటీ ఫార్మాట్ కు సంబంధించి వచ్చే ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకుని హార్దిక్ కు కెప్టెన్ గా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఐపీఎల్ లో గుజరాత్ జట్టును లీడ్ చేసిన పాండ్య ఆకట్టుకున్నాడు. తొలి సీజన్ లోనే గుజరాత్ ను ఛాంపియన్ గా నిలిపాడు. వ్యక్తిగతం గానూ నిలకడగా రాణిస్తుండడంతో సెలక్షన్ కమిటీ అతని వైపే మొగ్గు చూపుతోంది.