కరేబియన్ టూర్ లో ఇప్పటికే వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియాను అరుదైన రికార్డు ఊరిస్తోంది. మూడో వన్డేలోనూ గెలిస్తే విండీస్ గడ్డపై తొలిసారి క్లీన్స్వీప్ రికార్డును సొంతం చేసుకుంటుంది. విండీస్ గడ్డపై ఆ టీమ్ను ఇప్పటి వరకూ ఎప్పుడూ క్లీన్ స్వీప్ చేయలేదు. మూడు వన్డేల సిరీస్లో ఇప్పటికే 2-0 లీడ్లో ఉన్న శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని యంగ్ ఇండియాకు ఇప్పుడా అవకాశం ఉంది. 1983లో తొలిసారి వెస్టిండీస్లో వన్డే సిరీస్ ఆడిన భారత్ ఇప్పటి వరకూ ఎప్పుడూ స్వీప్ చేయలేకపోయింది. ఇండియాలో ఈ మధ్యే ఆ టీమ్ను క్లీన్స్వీప్ చేసినా.. ఇప్పుడు వాళ్ల సొంతగడ్డపై ఈ చరిత్ర సృష్టించే అవకాశం వచ్చింది. ఒకవేళ ఈ మ్యాచ్ గెలిస్తే టీమిండియాకు ఓవరాల్గా 13వ క్లీన్ స్వీప్ అవుతుంది. జింబాబ్వే, శ్రీలంకల తర్వాత భారత్ జట్టు వైట్వాష్ చేసిన మూడో విదేశీ సిరీస్ కూడా కానుంది.
జింబాబ్వేలో 2013, 2015, 2016లలో.. శ్రీలంకలో 2017లో వన్డే సిరీస్ను ఇండియన్ టీమ్ వైట్వాష్ చేసింది. ఇక విండీస్పై మూడో వన్డేలో గెలిస్తే తొలిసారి ఒక క్యాలండర్ ఇయర్లో ఒక టీమ్ను రెండుసార్లు వైట్వాష్ చేసిన ఘనతను సొంతం చేసుకుంటుంది. ఇప్పటి వరకూ క్రికెట్ చరిత్రలో ఇలా 2001లో బంగ్లాదేశ్పై జింబాబ్వే, 2006లో కెన్యాపై బంగ్లాదేశ్ రెండుసార్లు వైట్వాష్ చేసిన రికార్డులు నెలకొల్పాయి. కాగా
రెండో వన్డేలో గెలవగానే టీమిండియా ఓ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. వెస్టిండీస్పై వరుసగా 12వ వన్డే సిరీస్ విజయమిది. ఒక టీమ్పై వరుసగా అత్యధిక వన్డే సిరీస్ విజయాలు సాధించిన రికార్డు సాధించింది. మరోవైపు వెస్టిండీస్ చెత్త రికార్డు కొనసాగుతోంది. వన్డేల్లో ఇప్పటి వరకూ ఆ టీమ్ 22సార్లు వైట్వాష్కు గురి కాగా.. అందులో ఏడు సొంతగడ్డపైనే పాలవడం విండీస్ పేలవ ప్రదర్శనకు ఉదాహరణగా చెప్పొచ్చు.