ఇంగ్లాండ్ తో చివరి టెస్టులో ఆ జట్టును ఫాలో ఆన్ నుంచీ పరోక్షంగా భారత్ కాపాడిందా..అంటే అవుననే అంటున్నాడు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. మూడోరోజు భారత బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లను క్రీజులో బాగానే ఇబ్బంది పెట్టారు. ఇక ఫాలో ఆన్ లో పడడం ఖాయమని అంతా భావించారు. అయితే కోహ్లీ చేసిన తప్పిదమే ఇంగ్లాండ్ ను కాపాడిందని సెహ్వాగ్ అభిప్రాయ పడ్డాడు. జానీ బెయిర్ స్టోను విరాట్ కోహ్లీ అనవసరంగా రెచ్చగొట్టాడని ట్వీట్ చేశాడు. విరాట్ కోహ్లీ కవ్వింపులతో చతేశ్వర పుజారాలా ఆడుతున్న బెయిర్ స్టో.. రిషభ్ పంత్లా ఉగ్రరూపం దాల్చాడని సెటైర్లు వేశాడు.
విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్ చేయక ముందు జానీ బెయిర్ స్టో స్ట్రైక్రేట్ 21. తర్వాత 150. పుజారాలా ఆడుతున్న బెయిర్ స్టో.. కోహ్లీ కవ్వింపులతో రిషభ్ పంత్లా చెలరేగాడు’అని సెహ్వాగ్ ట్వీట్లో పేర్కొన్నాడు.
మహ్మద్ షమీ వేసిన 32 ఓవర్లో కోహ్లి, బెయిర్స్టో మధ్య మాటల యుద్ధం నడిచింది. షమీ బౌలింగ్లో బెయిర్స్టో ఆడటానికి కొంత ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లి అతన్ని చూసి నవ్వుకున్నాడు. సౌథీ కంటే షమీ వేగంగా బంతులు వేస్తున్నాడు కదా అని కామెంట్ చేశాడు. అంతటితో ఆగకుండా నీకు బాల్ తప్ప అన్నీ స్పష్టంగా కనిపిస్తాయ్ అంటూ కోహ్లి సెడ్జింగ్ చేశాడు. దీనిపై బెయిర్స్టో స్పందించాడు. కోహ్లిని కూడా ఏదో అన్నాడు. విషయం ముదిరి కాసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫీల్డ్ అంపైర్తో పాటు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్స్టోక్స్ కలగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఆ సమయానికి బెయిర్ స్టో 60 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఘటనపై సెహ్వాగ్ తనదైన శైలిలో కోహ్లికి చురకలు అంటించాడు.గొడవకు ముందు బెయిర్ స్టో స్ట్రయిక్ రేట్ 21 ఉండగా.. దాని తర్వాత అతని స్ట్రయిక్ రేట్ అమాంతం 150 కి పెరిగిందని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.