WC 2022 India: ఐసీసీ ఏర్పాట్లపై హిట్ మ్యాన్ అసంతృప్తి

టీ ట్వంటీ ప్రపంచకప్ మొదలైపోయింది. క్వాలిఫైయింగ్ టోర్నీ మ్యాచ్ లతో పలు జట్లు బిజీగా ఉంటే...

Published By: HashtagU Telugu Desk
Team India Hotel

Team India Hotel

టీ ట్వంటీ ప్రపంచకప్ మొదలైపోయింది. క్వాలిఫైయింగ్ టోర్నీ మ్యాచ్ లతో పలు జట్లు బిజీగా ఉంటే… సూపర్ 12 కు ముందు భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి టీమ్స్ వార్మప్ మ్యాచ్ లు ఆడనున్నాయి. వార్మప్ మ్యాచ్ ల కోసం బ్రిస్బేన్ చేరుకున్న టీమిండియా ఐసీసీ ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

భారత్ కు 4 స్టార్ హోటల్ లో బస ఏర్పాటు చేయడంపై కెప్టెన్ రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. అదే సమయంలో ఆస్ట్రేలియాకు 5 స్టార్ హోటల్ లో ఆతిథ్యం ఇవ్వడం, అలాగే పాక్ జట్టుకు సైతం అదే హోటల్ లో ఏర్పాట్లు చేయడంపై తీవ్రంగా మండిపడినట్టు తెలుస్తోంది. వరల్డ్ క్రికెట్ లో భారత్ ఎక్కడ ఆడినా ఆతిథ్య ఏర్పాట్లు ఓ రేంజ్ లోనే ఉంటాయి. అలాంటిది ఐసీసీ టోర్నీకి ఇలా 4 స్టార్ హోటల్ లో తమకు బస ఏర్పాటు చేయడమేంటని నిర్వాహకులపై రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. షెడ్యూల్ ప్రకారం భారత్ సోమవారం, బుధవారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో వార్మప్ మ్యాచ్ లు ఆడనుంది.

అయితే మిగిలిన జట్లకు 5 స్టార్ హోటల్ లోనూ, తమకు 4 స్టార్ హోటల్ లోనూ వసతి కల్పించడంపై హిట్ మ్యాన్ ఫైరయ్యాడు. దీనిపై బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. బీసీసీఐ అధికారులు గానీ, ఐసీసీ గానీ దీనిపై ఇంకా స్పందించలేదు. అయితే భారత్ లాంటి అగ్రశ్రేణి జట్టుకు ఇలాంటి ఆతిథ్యం ఇవ్వడం ఖచ్చితంగా అవమానించడమేనని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  Last Updated: 16 Oct 2022, 12:43 PM IST