ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముంబయి బ్యాటర్ టిమ్ డేవిడ్ 18 బంతుల్లో 48 పరుగులతో ఆకట్టుకున్నాడు. అతడు క్రీజులో ఉన్నంత సేపు హైదరాబాద్ గెలుపు అసాధ్యమే అనిపించింది. కానీ అతడు రనౌట్ కావడంతో మ్యాచ్ ఆరెంజ్ ఆర్మీ వైపు మళ్లింది. టిమ్ డేవిడ్ క్రీజులో ఉన్నంత సేపు విజయం తమదే అనే ధీమాతో ఉన్నామని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.
ఆఖరు రెండు ఓవర్ల వరకు మ్యాచ్ మా వైపే ఉంది. కానీ టిమ్ డేవిడ్ రనౌట్ కావడం దురదృష్టకరం. రనౌట్కు ముందు వరకు కూడా విజయంపై ధీమాగా ఉన్నాం. చివరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సి ఉన్నా ఆత్మవిశ్వాసంతోనే ఉన్నాం. కానీ విజయం చేజారింది. ఈ మ్యాచ్లో పూర్తి క్రెడిట్ హైదరాబాద్ బౌలర్లకే చెందుతుందని రోహిత్ చెప్పాడు. ఇదిలా ఉంటే భవిష్యత్తు అవసరాల దృష్టిలో ఉంచుకుని కొంత మంది యువకులతో ఇలాంటి ఒత్తిడి పరిస్థితుల్లో బౌలింగ్ చేయించాలనుకున్నామనీ, అందుకే ప్రయోగాలు చేసామన్నాడు. అయితే హైదరాబాద్ బ్యాటర్లు బాగా ఆడారనీ, చివరి వరకు తమ ఆటగాళ్ళు పోరాడినప్పటికీ విజయం సాధించలేకపోయామని చెప్పాడు.
ఆఖరు మ్యాచ్ లో గెలిచి సీజన్ ను విజయంతో ముగించాలనుకుంటున్నామని రోహిత్ శర్మ తెలిపాడు. ఈ మ్యాచ్లో టిమ్ డేవిడ్ నటరాజన్ వేసిన 18వ ఓవర్లో నాలుగు సిక్సర్లు బాదాడు. దీంతో ముంబయి గెలవాలంటే 12 బంతుల్లో 19 పరుగులు కావాల్సి ఉండగా.. 19వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ అద్భుతమే చేశాడు. వికెట్ సహా మెయిడెన్ ఓవర్ చేయడంతో మ్యాచ్ హైదరాబాద్ వైపు మొగ్గింది.