క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న టీ20 ప్రపంచకప్ 2022 సమరం నేటి నుంచి మొదలైంది. నేటి నుంచి గ్రూప్ దశ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. ఇక అసలు సమరం అంటే.. సూపర్- 12 మ్యాచులు అక్టోబర్ 22 నుంచి మొదలవుతాయి. టోర్నీ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. అక్టోబర్ 23న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.
అత్యధిక సిక్సర్లు: టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 31 సిక్సర్లు బాదాడు. మరో మూడు సిక్స్లు బాదితే ఈ టోర్నీలో భారత్ తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. ఈ జాబితాలో ప్రస్తతం టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (33 సిక్స్లు) టాప్లో ఉన్నాడు.
అత్యధిక పరుగులు: టీ20 ప్రపంచకప్లో శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్దనేపై అత్యధిక పరుగుల చేసిన రికార్డు ఉంది. ఐదు ప్రపంచకప్లు ఆడి.. 1016 పరుగులు చేశాడు జయవర్ధనే. ఈ టీ20 ప్రపంచకప్ లో రోహిత్ మరో 169 పరుగులు చేస్తే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్సమెన్ గా నిలవనున్నాడు. ఈ జాబితాలో ప్రస్తుతం రోహిత్ (847 పరుగులతో) 4వ స్థానంలో ఉన్నాడు.
సెంచరీ చేస్తే: 2010 ప్రపంచకప్లో క్రిస్ గేల్ విండీస్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. టీమిండియాతో జరిగిన మ్యాచ్లో 98 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ పొట్టి టోర్నీలో ఒక కెప్టెన్కు ఇదే అత్యధిక స్కోరు. ఈ టీ20 ప్రపంచకప్ లో రోహిత్ శర్మ ఈ రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది.
అత్యధిక మ్యాచ్లు: రోహిత్ శర్మ ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్లో 33 మ్యాచ్లు ఆడాడు. మరో మూడు మ్యాచ్లు ఆడితే.. ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రికెటర్గా నిలుస్తాడు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ ప్లేయర్ దిల్షాన్ (35) అగ్రస్థానంలో ఉన్నాడు. డ్వేన్ బ్రావో(34), షోయబ్ మాలిక్ (34), ఎంఎస్ ధోనీ (33), క్రిస్ గేల్ (33), రోహిత్ కంటే ముందున్నారు. ఈ టీ20 ప్రపంచకప్ ద్వారా రోహిత్ అగ్రస్థానానికి చేరుకోనున్నాడు