ICC ODI Rankings: ఇటీవలే భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ పూర్తయింది. భారత జట్టు 27 ఏళ్ల తర్వాత శ్రీలంకతో ద్వైపాక్షిక వన్డే సిరీస్ను కోల్పోయింది. స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లో శ్రీలంక 2-0తో టీమిండియాను ఓడించింది. అయితే సిరీస్ కోల్పోయినప్పటికీ వన్డే ర్యాంకింగ్స్లో భారత జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక పర్యటనలో కెప్టెన్ రోహిత్ శర్మ మెరుగైన బ్యాటింగ్తో రాణించాడు. రెండు మ్యాచ్ లోను హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయాడు. దీంతో వన్డే ర్యాంకింగ్స్ లో రోహిత్ సత్తా చాటాడు. అయితే స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఒక స్థానం కోల్పోయాడు. అటు లెఫ్టార్మ్ మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఐదు స్థానాలు ఎగబాకాడు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా 118 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా జట్టు 116 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 112 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. పాకిస్థాన్ 106 పాయింట్లతో నాలుగో స్థానంలో. న్యూజిలాండ్ టాప్-5 ర్యాంకింగ్లో చోటు దక్కించుకుంది. ఇక ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ నంబర్-1లో కొనసాగుతున్నాడు. టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ 782 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. హిట్మ్యాన్కు 763 పాయింట్లతో థర్డ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ 752 పాయింట్లతో నాలుగో స్థానంలో, ఐర్లాండ్కు చెందిన హ్యారీ టెక్టర్ 746 పాయింట్లతో టాప్-5 లో చోటు సంపాదించాడు.
ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో దక్షిణాఫ్రికా అనుభవజ్ఞుడైన స్పిన్నర్ కేశవ్ మహరాజ్ 716 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్వుడ్, ఆడమ్ జంపా వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐదు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానంలో నిలిచాడు. భారత పేసర్ మహ్మద్ సిరాజ్ టాప్-5 జాబితాలో ఉన్నాడు.