రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ దినేష్ కార్తీక్ను ఐపీఎల్ నిర్వాహకులు మందలించారు. లక్నోతో ఈనెల 25న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో అంపైర్ తో దినేష్ దురుసుగా ప్రవర్తించాడనే అభియోగాలు ఉన్నాయి. దీన్ని ఐపీఎల్ నిర్వాహకులు తీవ్రంగా పరిగణించారు. ఐపీఎల్ కోడ్ ను ఉల్లంఘించినందుకు దినేష్ కార్తీక్ ను హెచ్చరించారు. ఐపీఎల్లో మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయమని దాన్ని కార్తీక్ ఉల్లంఘించడంతోనే మందలించినట్లు స్పష్టం చేశారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1 తప్పిదం చేశానని దినేష్ కార్తీక్ కూడా ఒప్పుకున్నాడని పేర్కొన్నారు.
అసలు ఏం జరిగిందంటే..
లక్నో, బెంగళూరు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో అవేశ్ ఖాన్ వేసిన చివరి ఓవర్లో దినేష్ కార్తీక్ ఆఫ్ వికెట్ బయటకు వచ్చి ఆడిన బంతిని అంపైర్ వైడ్గా ప్రకటించలేదు. దాంతో సహనం కోల్పోయిన దినేష్ గట్టిగా అరిచాడు.. బహుశా ఈ కారణంతోనే ఐపీఎల్ నిర్వాహకులు మందలించి ఉంటారని భావిస్తున్నారు. అవేశ్ ఖాన్ పరుగులు తగ్గించుకోవడానికి చివరి ఓవర్లో ఆఫ్ వికెట్కి అవతలగా రెండు బంతులు విసరగా.. దినేష్ వాటిని ఆడలేకపోయాడు. ఈ మ్యాచ్లో 23 బంతుల్లో దినేష్ 37 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. బెంగళూరు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.