Ravi Shastri 2023 వన్డే ప్రపంచ కప్ ఈ ఏడాది చివర్లో భారతదేశంలో జరగనుంది. వన్డే ప్రపంచ కప్ తర్వాత భారత క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్లో కొత్త కెప్టెన్ నాయకత్వంలో నడవనుంది. అయితే కొత్త కెప్టెన్ చర్చ ఇప్పటికే ప్రారంభమైంది. కాగా వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియా కెప్టెన్సీ ఎవరికి దక్కుతుందనే విషయంపై టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) తన మనసులోని మాటని బయటపెట్టాడు.
వన్డే ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ వన్డే, టీ20 అంతర్జాతీయ కెప్టెన్సీ నుండి తొలగించి హార్దిక్ పాండ్యాను రెండు ఫార్మాట్లలో రెగ్యులర్ కెప్టెన్ గా చేయాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. 2022 టీ20ప్రపంచ కప్లో భారత్ పేలవమైన ప్రదర్శన తర్వాత టీమిండియా టీ20 జట్టుకి హార్దిక్ కెప్టెన్ గా బాధ్యతలు వహిస్తున్నాడు. ది వీక్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఇలా అన్నాడు. హార్దిక్ పాండ్యా శరీరం టెస్ట్ క్రికెట్ను తట్టుకోలేదని నేను భావిస్తున్నాను. కాబట్టి 2023 వన్డే ప్రపంచ కప్ తర్వాత పాండ్యాను పరిమిత ఓవర్ల కెప్టెన్సీని చేపట్టాలని అన్నాడు. రోహిత్ శర్మ మిగతా ఫార్మాట్లకి కెప్టెన్గా ఉంటాడు. అందులో ఎలాంటి సందేహం లేదు అని చెప్పుకొచ్చాడు.
ఇంతకుముందు రిషబ్ పంత్, కెఎల్ రాహుల్లు టీమ్ ఇండియాకు కాబోయే కెప్టెన్లుగా కనిపించారు. ఈ జాబితాలో శ్రేయాస్ అయ్యర్ పేరు కూడా చేరింది. అయితే దీని తర్వాత ఐపిఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ తమ జట్టు కెప్టెన్సీని హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. అప్పుడు హార్దిక్ ఆటతీరుతో మార్పు వచ్చింది. హార్దిక్ తొలిసారిగా అతని కెప్టెన్సీలో గుజరాత్కు టైటిల్ను అందించాడు. అతని కెప్టెన్సీకి అందరూ అభిమానులయ్యారు. దీని తర్వాత 2022 టీ20 ప్రపంచ కప్ తర్వాత హార్దిక్ భారత టీ20 జట్టుకు కెప్టెన్గా నియమించబడ్డాడు. ఇక్కడ కూడా తన కెప్టెన్సీతో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2023లో అతని కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ జట్టు ఫైనల్స్ వరకు ప్రయాణించిన విషయం తెలిసిందే.