Praggnanandhaa No 1 : యువ గ్రాండ్ మాస్టర్ రమేశ్బాబు ప్రజ్ఞానంద మరోసారి తన సత్తా చాటాడు. చెస్ ర్యాంకింగ్స్లో దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ను దాటేసి.. నంబర్ 1 భారత ప్లేయర్గా ప్రజ్ఞానంద నిలిచాడు. అతడు దేశంలోనే నంబర్ 1 చెస్ ప్లేయర్గా నిలవడం కెరీర్లో ఇదే మొదటిసారి కావడం విశేషం. బుధవారం జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్ నాలుగో రౌండ్లో ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్ను (చైనా) ఓడించడం ద్వారా ఈ ఘనతను ప్రజ్ఞానంద సొంతం చేసుకున్నాడు. ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం.. ప్రజ్ఞానంద 2748.3 పాయింట్లతో 11వ స్థానంలో నిలవగా, చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ 2748 పాయింట్లతో 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో భారత్లో నంబర్ 1 ప్లేసుకు ఈ యువ గ్రాండ్మాస్టర్ ఎగబాకాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్లాసికల్ చెస్ విభాగంలో వర్లడ్ ఛాంపియన్ను ఓడించిన రెండో భారతీయుడిగా ప్రజ్ఞానంద మరోసారి రికార్డులకు ఎక్కాడు. ఈసందర్భంగా ప్రజ్ఞానందను అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రశంసించారు. తన ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్లో ఈ చెస్ ప్లేయర్ను కీర్తించారు. ప్రజ్ఞా సాధించిన విజయాన్ని, ఘనతను చూసి గర్వంగా ఉందన్నారు. ప్రజ్ఞానందకు ఆర్థిక సహాయం అందిస్తామని ఇటీవలే అదానీ గ్రూప్(Praggnanandhaa No 1) ప్రకటించింది.
We’re now on WhatsApp. Click to Join.
2024- ప్రపంచ క్యాండిడేట్స్ పోరులో తొలిసారిగా భారత్కు చెందిన నలుగురు యువ గ్రాండ్ మాస్టర్లు బరిలోకి దిగబోతున్నారు. పురుషుల, మహిళా చాంపియన్లతో జరిగే టైటిల్ పోరుకు అర్హతగా టొరంటోలో అంతర్జాతీయ చదరంగ సమాఖ్య నిర్వహించే ఈ టోర్నీకి భారత్ కు చెందిన నలుగురు యువగ్రాండ్ మాస్టర్లు అర్హత సాధించారు. ఇంత పెద్దసంఖ్యలో భారత్ నుంచి అర్హత సాధించడం ఇదే మొదటిసారి. నార్వేకు చెందిన ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ చదరంగ ఆటగాడు మాగ్నుస్ కార్ల్ సన్ ఈ టోర్నీలో పాల్గొనబోనని ప్రకటించాడు. దీంతో కార్ల్ సన్ కు బదులుగా గ్రాండ్ మాస్టర్ నిజత్ అబసోవ్ పోటీకి దిగుతాడని అంతర్జాతీయ చెస్ సమాఖ్య ప్రకటించింది. క్యాండిడేట్స్ టోర్నీలో తలపడే మొత్తం ఎనిమిది మంది గ్రాండ్ మాస్టర్ల జాబితాను విడుదల చేసింది. 8 మందిలో ముగ్గురు భారత గ్రాండ్ మాస్టర్లు.. ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే ) ప్రకటించిన 8 మంది క్యాండిడేట్స్ పురుషుల ఫైనల్స్ జాబితాలో తొలిసారిగా ముగ్గురు భారత యువగ్రాండ్ మాస్టర్లు చోటు సంపాదించారు. వీరిలో 2023 ప్రపంచకప్ రన్నరప్ ప్రజ్ఞానంద్, స్విస్ గ్రాండ్ మాస్టర్ టోర్నీ విన్నర్ విదిత్ గుజరాతీ, ఫిడే సర్క్యూట్ విన్నర్ గుకేశ్ ఉన్నారు.