Junaid Khan: అడిలైడ్లో జరిగిన క్రికెట్ మ్యాచ్లో పాకిస్థానీ మూలానికి చెందిన ఆస్ట్రేలియా ఆటగాడు జునైద్ జాఫర్ ఖాన్ (Junaid Khan) ఎండ వేడి కారణంగా మైదానంలోనే మరణించిన విషాద సంఘటన జరిగింది. అధిక వేడి కారణంగా అతను అకస్మాత్తుగా మైదానంలో పడిపోయాడు. ఆ తర్వాత అతను మరణించాడు. ఈ సంఘటన శనివారం ACDTలోని కాంకోర్డియా కాలేజీ ఓవల్లో జరిగింది.
తీవ్రమైన వేడి కారణంగా మరణం
పారామెడిక్స్ టీమ్ నుంచి జునైద్ చికిత్స పొందాడు. కానీ అప్పటికే ఆటగాడు మరణించాడు. ఘటన జరిగిన సమయంలో విపరీతమైన వేడి నెలకొంది. దాదాపు 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జునైద్ పస్తులుంటూ క్రికెట్ ఆడుతున్నాడు. అయితే అస్వస్థతకు గురికావడంతో నిబంధనల మేరకు నీళ్లు తాగాడు. అయితే అప్పటికే జునైద్ ప్రాణాలు విడిచాడు.
Also Read: Summer Clothes: ఈ వేసవిలో ఎలాంటి బట్టలు వేసుకుంటే మంచిదో తెలుసా?
ఈ సంఘటన తర్వాత ఓల్డ్ కాంకార్డియన్స్ క్రికెట్ క్లబ్ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఓల్డ్ కాంకార్డియన్స్ క్రికెట్ క్లబ్లోని విలువైన సభ్యుడు మరణించినందుకు మేము చాలా బాధపడుతున్నాం. అతను ఈ రోజు కాంకోర్డియా కాలేజ్ ఓవల్లో ఆడుతున్నప్పుడు అనుకోని కారణాల వలన విషాదకరంగా మరణించాడు. పారామెడిక్స్ ఎంత ప్రయత్నించినప్పటికీ అతన్ని కాపాడలేకపోయారు. ఈ క్లిష్ట సమయంలో మా ఆలోచనలు, హృదయపూర్వక సానుభూతిని అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులు, సహోద్యోగులకు తెలియజేస్తున్నామని పేర్కొంది.
జునైద్ ఖాన్ వయసు దాదాపు 40 ఏళ్లు. 2013లో క్రికెట్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. అతను చాలా సంవత్సరాలు అడిలైడ్లో క్రికెట్ ఆడాడు. జునైద్ మరణం తర్వాత అతని సహచరుడు హసన్ అంజుమ్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ఇది చాలా పెద్ద నష్టమని విలపించాడు.