Site icon HashtagU Telugu

New Zealand vs Pakistan: ఫైనల్లో ఓడిన కివీస్‌… పాక్‌దే ట్రై సిరీస్.!

347545.4 1280x720 11zon

347545.4 1280x720 11zon

టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు ముందు పాకిస్థాన్ ఫామ్‌లోకి వచ్చింది. న్యూజిలాండ్ గడ్డపై జరిగిన ట్రై సిరీస్‌లో విజేతగా నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో పాక్‌ 5 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనర్ ఫిన్ అలెన్ 12 పరుగులకే ఔటవగా.. తర్వాకత కాన్వే కూడా వెనుదిరిగాడు. అయితే కేన్ విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.

మెరుపు బ్యాటింగ్‌తో 38 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 రన్స్ చేసాడు. తర్వాత గ్లెన్ ఫిలిప్స్ 29, చాప్‌మాన్ 25, జిమ్మీ నీషమ్ 17 పరుగులతో రాణించారు. చివర్లో పాక్ బౌలర్లు కట్టడి చేయడంతో న్యూజిలాండ్ 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో నసీమ్ షా 2, రవూఫ్ 2 వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌లో పాకిస్థాన్‌ త్వరగానే బాబర్ అజామ్ వికెట్ చేజార్చుకుంది. మరో ఓపెనర్ రిజ్వాన్ 34 , మసూద్ 19 పరుగులకు ఔటవగా.. పాక్‌ కష్టాల్లో పడినట్టు కనిపించింది. అయితే మహ్మద్ నవాజ్ , హైదర్ అలీ ధాటిగా ఆడారు. వీరిద్దరూ 56 పరుగులు జోడించారు. హైదర్ అలీ 15 బంతుల్లో 31 రన్స్‌కు ఔటవగా.. చివర్లో కాస్త ఉత్కంఠ నెలకొంది. ఈ దశలో ఇఫ్తికర్ అహ్మద్ 14 బంతుల్లో 25 రన్స్ చేయడంతో పాకిస్థాన్ మరో మూడు బంతులు మిగిలుండగా టార్గెట్‌ను ఛేదించింది. టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ తమ ఆరంభ మ్యాచ్‌లో పాక్ భారత్‌తోనే తలపడనుండగా.. ట్రై సిరీస్ విజయం తమ కాన్ఫిడెన్స్ పెంచిందని కెప్టెన్ బాబర్ అజామ్ వ్యాఖ్యానించాడు.