వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఆసియా కప్ టోర్నీలో భారత్ ఆడదని బీసీసీఐ ఇప్పటికే తేల్చేసింది. ఒకవేళ టోర్నీ తటస్థ వేదికలో నిర్వహిస్తే మాత్రం పాల్గొంటామని బీసీసీఐ సెక్రటరీ జైషా చెప్పేశారు. తాజాగా బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ కూడా దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పాకిస్థాన్లో టీమిండియా పర్యటించే విషయం బీసీసీఐ చేతిలో ఉండదని, భారత ప్రభుత్వం నిర్ణయమే ఫైనల్ అన్నాడు.
తాము ఏదైనా దేశం లేదా ఇతర దేశాలకు వెళ్లాలనుకుంటే ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తీసుకోవాలనీ, తామంతట తాము నిర్ణయం తీసుకునే అధికారం లేదన్నాడు. ఇటీవల బీసీసీఐ కార్యదర్శిగా రెండోసారి ఎంపికైన ఏసీసీ అధ్యక్షుడు జైషా 2023 ఆసియా కప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ టోర్నీ తటస్థ వేదికపై జరుగుతుందని ప్రకటించారు. అనంతరం జైషా వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆశ్చర్యాన్ని వ్యక్తంచేసింది. ఏసీసీ, పీసీబీల్లో ఎలాంటి చర్చ లేదా సంప్రదింపులు లేకుండా వాటి దీర్ఘకాలిక పరిణామాలు, చిక్కుల గురించి ఆలోచనలు లేకుండా సంచలన కామెంట్స్ చేశారని స్పష్టం చేసింది. తాము కూడా వన్డే వరల్డ్ కప్ ను బాయ్ కాట్ చేస్తామంటూ బెదిరించింది. దీనికి బీసీసీఐ కూడా గట్టి రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఒక్క టీమ్ రాకుంటే టోర్నీ ఆగిపోదని బీసీసీఐ మాజీ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.