Site icon HashtagU Telugu

Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియానికి బిగ్ షాక్‌.. ఆర్సీబీ జ‌ట్టే కార‌ణ‌మా?!

Chinnaswamy Stadium

Chinnaswamy Stadium

Chinnaswamy Stadium: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి (Chinnaswamy Stadium) కష్టాలు ముసురుకుంటున్నాయి. ఇటీవల ఆర్‌సీబీ విజయోత్సవ ర్యాలీలో జరిగిన విషాద సంఘటన తర్వాత ఈ మైదానంపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30 నుండి జరగనున్న మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 మ్యాచ్‌లను చిన్నస్వామి నుండి వేరే వేదికకు మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. చిన్నస్వామిలో జరగాల్సిన మ్యాచ్‌లు ఇప్పుడు తిరువనంతపురంలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఐపీఎల్ విషాదం తర్వాత చిన్నస్వామిపై ఒత్తిడి

ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ తొలిసారిగా ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత విజయోత్సవ పరేడ్ కోసం చిన్నస్వామి స్టేడియం వద్ద భారీ సంఖ్యలో అభిమానులు పోగయ్యారు. అంచనాలకు మించి సుమారు 5 లక్షల మందికి పైగా అభిమానులు రావడంతో స్టేడియం బయట తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది అభిమానులు దుర్మరణం చెందారు. ఈ ఘటన తర్వాత పోలీసులు జనసమూహాన్ని నియంత్రించడంలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

Also Read: 7 Seat Hybrid Car: ఈ కారు ఫుల్ ట్యాంక్‌తో 1200 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించ‌వ‌చ్చు!

మహిళల వరల్డ్ కప్ మ్యాచ్‌ల వేదిక మార్పు

క్రిక్‌బజ్ తాజా నివేదిక ప్రకారం.. మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 మ్యాచ్‌ల ఆతిథ్య హక్కులను చిన్నస్వామి స్టేడియం నుండి ఉపసంహరించుకున్నారు. వాస్తవానికి ఈ స్టేడియం మొత్తం ఐదు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఇందులో టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ కూడా ఉంది. అంతేకాకుండా రెండవ సెమీఫైనల్‌కు కూడా చిన్నస్వామి వేదికగా నిర్ణయించారు. కానీ ఈ అన్ని మ్యాచ్‌లను ఇప్పుడు తిరువనంతపురంకు మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 షెడ్యూల్

మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సెప్టెంబర్ 30న ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్‌లో టీమ్ ఇండియా శ్రీలంకతో తలపడనుంది. అక్టోబర్ 5న టీమ్ ఇండియా పాకిస్తాన్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నమెంట్ సెమీఫైనల్స్ అక్టోబర్ 29, 30 తేదీల్లో, ఫైనల్ మ్యాచ్ నవంబర్ 2న జరగనుంది. ఈ టోర్నమెంట్ కోసం కొత్త వేదికల గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.