వరల్డ్ క్రికెట్ లో భారత్ ఆధిపత్యం చూసి ఎప్పుడూ అసూయపడే పాక్ క్రికెటర్లు తాజాగా టీ ట్వంటీ ప్రపంచకప్ కు సంబంధించి ఇష్టానుసారం విమర్శలు చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఐసీసీ భారత్ ను ఫైనల్ కు పంపించేందుకే ప్రయత్నిస్తోందంటూ పాక్ మాజీ ఆటగాడు అఫ్రిది చేసిన వ్యాఖ్యలే వారి అక్కసుకు నిదర్శనం. అయితే అఫ్రిది చేసిన పనికిమాలిన విమర్శలకు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇలాంటి వ్యాఖ్యలు సరికావని.. ఇష్టారీతిన మాట్లాడితే సహించబోమన్నాడు.
క్రికెట్ ప్రపంచంలో భారత్ పవర్హౌజ్ లాంటిదైనప్పటికీ తాము ప్రత్యేక ప్రయోజనాలేమీ పొందడం లేదని స్పష్టం చేశాడు. ఐసీసీ తమకు ఏ రకంగానూ అనుకూలంగా వ్యవహరించడం లేదన్నాడు. ప్రతి జట్టు పట్ల వాళ్ల వైఖరి ఒకేలా ఉంటుందని చెప్పాడు. ఏ ప్రాతిపదికన అలా మాట్లాడతారని సూటిగా ప్రశ్నించాడు. మిగతా జట్ల కంటే తమకు అదనంగా లభించిన ప్రయోజనాలు ఏమిటో చెప్పాలన్నాడు. టీ20 ప్రపంచకప్ లో టీమిండియా- బంగ్లాదేశ్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడం తర్వాత మ్యాచ్ ను కొనసాగించడం జరిగాయి. అయితే ఫీల్డ్ తడిగా ఉన్నా మ్యాచ్ ఎలా కొనసాగిస్తారని, భారత్ను సెమీస్ చేర్చాలనే ఉద్దేశంతోనే ఐసీసీ ఇలా వ్యవహరిస్తోందంటూ అఫ్రిది ఆరోపణలు చేశాడు.