Site icon HashtagU Telugu

BCCI: జాతీయ క్రీడా పరిపాలన బిల్లు.. బీసీసీఐపై ప్ర‌భావం ఎంత‌?

Sports Governance Bill

Sports Governance Bill

BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇకపై జాతీయ క్రీడా పరిపాలన బిల్లు పరిధిలోకి రానుంది. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం తీసుకోకపోయినప్పటికీ ప్రతిపాదిత జాతీయ క్రీడా బోర్డు నుండి గుర్తింపు పొందడం BCCIకి తప్పనిసరి. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో టీమ్ ఇండియా భాగస్వామ్యం తరువాత ఈ పరిణామం ఊపందుకుంది.

బిల్లు ముఖ్య లక్ష్యాలు

భారతదేశంలో క్రీడా వ్యవస్థను మెరుగుపరచడానికి యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఈ క్రీడా బిల్లు ముసాయిదాను ప్రవేశపెట్టింది. దీని అమలుతో BCCI ఒక జాతీయ క్రీడా సమాఖ్య (NSF)గా ఈ బిల్లు పరిధిలోకి వస్తుంది. PTI నివేదిక ప్రకారం.. బీసీసీఐ ఇతర NSFల వలె స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉంటుంది. అయితే, వాటికి సంబంధించిన వివాదాలను ప్రతిపాదిత జాతీయ క్రీడా మధ్యవర్తిత్వం పరిష్కరిస్తుంది. ఈ బిల్లు ఏ NSFపై ప్రభుత్వ నియంత్రణను సూచించదు. బదులుగా సుపరిపాలనను నిర్ధారించడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంది అని పేర్కొంది.

2019 వరకు BCCIకి జాతీయ క్రీడా సమాఖ్యగా గుర్తింపు లేదు. ఇది 2020లో సమాచార హక్కు చట్టం పరిధిలోకి వచ్చింది. కొత్త క్రీడా బిల్లులో BCCIని చేర్చిన తర్వాత క్రికెట్ బోర్డు క్రీడా మంత్రిత్వ శాఖ అన్ని నియమాలు, మార్గదర్శకాల పరిధిలోకి వస్తుంది. లోధా కమిటీ సిఫార్సులు, వయస్సు పరిమితి, ప్రయోజనాలకు సంబంధించిన నిబంధనలు భవిష్యత్తులో కూడా అమలులో ఉంటాయా లేదా అనేది చూడాలి.

Also Read: Manchester Test: మాంచెస్టర్ టెస్ట్.. వాతావరణ అంచనా, జట్టు మార్పులీవే!

ఈ బిల్లు అనేక విఫల ప్రయత్నాల తర్వాత రూపొందించబడింది. దీని లక్ష్యం క్రీడాకారుల హక్కులను రక్షించడం, క్రీడా రంగంలో వివాద రహిత వాతావరణాన్ని సృష్టించడం. ఇది 2036 ఒలింపిక్ గేమ్స్ బిడ్ కోసం భారతదేశం విశ్వసనీయతను బలోపేతం చేస్తుంది. ఇండియా టుడే నివేదిక ప్రకారం.. ఈ బిల్లు లింగ ప్రాతినిధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రతి కార్యనిర్వాహక కమిటీలో కనీసం నలుగురు మహిళలను చేర్చడం తప్పనిసరి చేస్తుంది. ఈ సంస్థ క్రీడా సంబంధిత వివాదాల పరిష్కారానికి అంకితమైన యంత్రాంగంగా పనిచేస్తుంది. దీని నిర్ణయాలను కేవలం సుప్రీంకోర్టులోనే సవాలు చేయవచ్చు.

స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు స్పోర్ట్స్ ఫెడరేషన్‌లను ఎలా ప్రభావితం చేస్తుంది?

స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు భారత క్రీడలలో విస్తృతమైన మార్పులను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. దీని కింద జాతీయ క్రీడా బోర్డు స్థాపించబడుతుంది. దీనికి ఫిర్యాదుల ఆధారంగా లేదా స్వీయ చొరవతో క్రీడా సమాఖ్యలను సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రతిపాదిత సంస్థకు అనేక సమస్యలపై చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది.

ఇండియా టుడే ఈ ముసాయిదా నివేదికను ఉటంకిస్తూ.. జాతీయ క్రీడా బోర్డును ఒక ప్రెసిడెంట్ నడిపిస్తారని తెలిపింది. ప్రభుత్వ పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ ద్వారా కొంతమంది సభ్యులను చేర్చుకుంటారు. క్రీడా కార్యదర్శి లేదా క్యాబినెట్ కార్యదర్శి ఎంపిక ప్యానెల్‌కు అధ్యక్షత వహిస్తారు. ఇందులో అర్జున, ఖేల్ రత్న లేదా ద్రోణాచార్య అవార్డు పొందిన ఒక ప్రముఖ క్రీడాకారుడు, జాతీయ సమాఖ్యల ఇద్దరు మాజీ ఉన్నత అధికారులు, అథారిటీ డైరెక్టర్ జనరల్ ఉంటారు.