బంగ్లాదేశ్ టూర్ లో భారత్ డెత్ బౌలింగ్ వైఫల్యం మరోసారి రుజువైంది. ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన మన బౌలర్లు తర్వాత చేతులెత్తేశారు. గత మ్యాచ్ లో భారత్ ఓటమికి కారణమయిన మేహది హాసన్ మరోసారి బంగ్లాను ఆదుకున్నాడు. ఫలితంగా రెండో వన్డేలో బంగ్లాదేశ్ భారీ స్కోరు సాధించింది.
ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. యువ స్పిన్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ స్థానంలో అక్షర్ పటేల్, పేసర్ కుల్దీప్ సేన్ స్థానంలో కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్కు తుది జట్టులో చోటు దక్కింది. భారత బౌలర్ల విజృంభణతో టాప్, మిడిలార్డర్ కుప్పకూలింది. కేవలం 69 రన్స్ కే 6 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ల జోరు ముందు బంగ్లా కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ మెహ్దీ హసన్ మీర్జా మరోసారి జట్టును ఆదుకున్నాడు.మహ్మదుల్లాతో కలిసి మెహ్దీ హసన్ ఏడో వికెట్కు 148 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించాడు.
ఆరో స్థానంలో వచ్చిన మహ్మదుల్లా 77 పరుగులు చేయగా.. మిరాజ్ ఆఖరి బంతి వరకు అజేయంగా నిలిచి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. సిరాజ్కు రెండు, సుందర్కు మూడు, ఉమ్రాన్కు రెండు వికెట్లు దక్కాయి.