ఉత్కంఠభరితంగా సాగిన న్యూజిలాండ్,ఇంగ్లాండ్ రెండో టెస్టులో ఆతిథ్య జట్టు ఇంగ్లీష్ టీమ్ సంచలన విజయం సాధించింది. ఎవ్వరూ ఊహించని విధంగా 50 ఓవర్లలో 299 పరుగుల టార్గెట్ను ఛేదించింది. చివరిరోజు ఈ మ్యాచ్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
రెండో ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ను ఇంగ్లాండ్ బౌలర్లు కట్టడి చేశారు. యంగ్, కాన్వే, మిఛెల్ హాఫ్ సెంచరీలతో భారీస్కోర్ దిశగా సాగుతున్న కివీస్ను 284 పరుగులకు పరిమితం చేశారు. దీంతో 299 పరుగుల టార్గెట్ను 50 ఓవర్లలో ఛేదించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే కివీస్ బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ కూడా తడబడింది. 93 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. లీస్ 44 , పోప్ 18 , రూట్ 3 , క్రాలే డకౌటయ్యారు. ఇక డ్రా కోసం ఆడతారులే అని అంతా భావించిన వేళ జానీ బెయిర్ స్టో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన బెయిర్ స్టో బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా అతనికి జత కలవడంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.
చివరి 16 ఓవర్లలో 160 పరుగులు చేయాల్సి ఉండగా.. అప్పటికి కూడా మ్యాచ్ డ్రాగానే ముగుస్తుందని అంతా భావించారు. అయితే జోరు పెంచిన బెయిర్ స్టో 92 బంతుల్లోనే 7 సిక్సర్లు, 14 ఫోర్లతో 136 రన్స్ చేశాడు. బెయిర్ స్టో ఔటైనప్పటకీ.. స్టోక్స్, వికెట్ కీపర్ ఫోక్స్ ఇంగ్లాండ్ విజయాన్ని పూర్తి చేశారు. ఇంగ్లాండ్ చివరి సెషన్లో ఓవర్కు 10 పరుగుల రన్రేట్ సాధించడం హైలెట్గా చెప్పొచ్చు. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 553 రన్స్ చేయగా.. ఇంగ్లాండ్ 539 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ను ఇంగ్లాండ్ 2-0తో కైవసం చేసుకుంది.