IPL Tickets: ఐపీఎల్ టికెట్లకు భారీ డిమాండ్.. సైబర్ నేరగాళ్ల మోసాలు.. హైదరాబాద్ సిటీ పోలీసుల హెచ్చరికలు

నగరంలో ఐపీఎల్ ఫీవర్ తారాస్థాయికి చేరుకుంది. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ నెల 22న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్‌కు విపరీతమైన డిమాండ్ నెలకొంది. విరాట్ కోహ్లీ, ప్యాట్ కమిన్స్ వంటి స్టార్ ఆటగాళ్ల పోరును ప్రత్యక్షంగా వీక్షించాలన్న అభిమానుల ఆతృతను సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ యాప్‌లు, మోసపూరిత వెబ్‌సైట్ల ద్వారా టికెట్ల విక్రయం పేరుతో భారీ దోపిడీకి తెరలేపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర […]

Published By: HashtagU Telugu Desk
Sajjanar 

Sajjanar 

నగరంలో ఐపీఎల్ ఫీవర్ తారాస్థాయికి చేరుకుంది. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ నెల 22న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్‌కు విపరీతమైన డిమాండ్ నెలకొంది. విరాట్ కోహ్లీ, ప్యాట్ కమిన్స్ వంటి స్టార్ ఆటగాళ్ల పోరును ప్రత్యక్షంగా వీక్షించాలన్న అభిమానుల ఆతృతను సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ యాప్‌లు, మోసపూరిత వెబ్‌సైట్ల ద్వారా టికెట్ల విక్రయం పేరుతో భారీ దోపిడీకి తెరలేపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ క్రికెట్ ప్రియులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు.

ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, ‘ఎక్స్’ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లలో ఐపీఎల్ టికెట్లపై ఆకర్షణీయమైన ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన ‘డిస్ట్రిక్ట్’ యాప్‌ను పోలిన నకిలీ యాప్‌లను, క్లోన్ వెబ్‌సైట్లను సైబర్ నేరగాళ్లు సృష్టించారు. అసలు యాప్‌ను తలపించేలా లోగోలు, డిజైన్లు ఉపయోగించి, తక్కువ ధరలకే ప్రీమియం స్టాండ్ టికెట్లు ఇస్తామంటూ ఊరిస్తున్నారు. ఈ నకిలీ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ లేదా ఏపీకే ఫైల్స్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకునేలా లింకులను పంపిస్తున్నారు.

ఈ మోసాలపై సీపీ సజ్జనార్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. “సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక ఐపీఎల్ టికెట్ ప్రకటనలను నమ్మవద్దు. అధికారిక యాప్‌ను పోలిన నకిలీ లింకులను క్లిక్ చేసి టికెట్లు బుక్ చేస్తే మీ డబ్బు గల్లంతవ్వడం ఖాయం. డబ్బులు కోల్పోవడమే కాకుండా, మీ బ్యాంకు ఖాతా వివరాలు కూడా నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది” అని హెచ్చరించారు.

మ్యాచ్ చూడాలనే ఉత్సాహంతో సోషల్ మీడియా లింకులు, బ్లాక్ మార్కెట్ టికెట్ల ప్రకటనలను నమ్మి మోసపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్లపై నిఘా ఉంచామని, ఎవరికైనా అనుమానాస్పద సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 1930 లేదా స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. క్రికెట్ అభిమానులు తమ కష్టార్జితాన్ని కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

  Last Updated: 16 May 2026, 02:04 PM IST