RCB Camp: ఢిల్లీపై ముంబై విజయఢంకా.. ఆర్సీబీ చీర్స్.. ఎందుకంటే ?

మే 21న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ పై ఎవరి దృష్టి నిలిచిందో .. లేదో.. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ మాత్రం ఆ మ్యాచ్ ను రెప్పవాల్చకుండా చూసింది.

  • Written By:
  • Publish Date - May 22, 2022 / 02:43 PM IST

మే 21న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ పై ఎవరి దృష్టి నిలిచిందో .. లేదో.. కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ మాత్రం ఆ మ్యాచ్ ను రెప్పవాల్చకుండా చూసింది. ప్లే ఆఫ్ రౌండ్ కు తమ జట్టు అర్హత సాధించే అవకాశాలను తేల్చే నిర్ణయాత్మక మ్యాచ్ ను ఆద్యంతం ఆసక్తిదాయకంగా తిలకించింది. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య హోరాహోరీగా జరిగిన మ్యాచ్ ..రాయల్ ఛాలెంజర్స్ క్యాంప్ లో హైటెన్షన్ పుట్టించింది.

వారి ఉద్వేగాలు, భావోద్వేగాలు, హావభావాలు, విజయానందం, హర్షాతిరేకాలు, కేరింతలు, పరస్పర అభినందనలతో రాయల్ ఛాలెంజర్స్ డ్రెస్సింగ్ రూమ్ మార్మోగింది. ఈ మ్యాచ్ లోని ప్రతి దశలో ఆర్సీబీ ప్లేయర్స్ స్పందన ఎలా ఉంది అనే దృశ్యాలతో కూడిన ఒక వీడియో ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.

దీన్ని ఆర్సీబీ టీమ్ తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసింది.ఆ రోజు మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 రన్స్ చేసింది. 160 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ టీమ్ చివరి దాకా చెమటోడ్చాల్సి వచ్చింది. మరో 5 బంతులు మిగిలి ఉన్నాయనగా(19.1 ఓవర్లలో).. 160 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ప్లే ఆఫ్ కు ఆర్సీబీ అర్హత సాధించేందుకు మార్గం సుగమం అయింది. దీనితోపాటు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జయింట్స్ టీమ్ లు కూడా ప్లే ఆఫ్ కు క్వాలిఫై అయ్యాయి.