గాయం నుంచి కోలుకుని ఎప్పుడు మైదానంలో అడుగుపెడదామని ఎదురు చూస్తున్న టీమిండియా క్రికెటర్ కే ఎల్ రాహుల్ కు షాక్ తగిలింది. ఫిట్ నెస్ సాధించే క్రమంలో బెంగుళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో శ్రమిస్తున్న రాహుల్ కరోనా సోకింది. తాజాగా కరోనా పరీక్షల్లో అతడికి పాజిటివ్గా తేలడంతో ఐసోలేషన్కు తరలించారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలియజేశారు.
కోవిడ్ బారిన పడటంతో అతడు.. వెస్టిండీస్తో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ కు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది.కేఎల్ రాహుల్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని బెంగళూరులోని ఎన్సీఏలో మళ్లీ శిక్షణ పొందుతున్నాడు. అతడు జులై 29 నుంచి జరగనున్న వెస్టిండీస్తో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ కోసం టీమిండియాకు ఎంపికయ్యాడు. కోవిడ్ టెస్టు పాజిటివ్గా రావడంతో ఇప్పుడు అతడు.. విండీస్ పర్యటనకు వెళ్తాడా లేదా అనేదానిపై సందిగ్ధత నెలకొంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో భారత్కు కెప్టెన్సీ గా ఎంపికైన రాహుల్ గాయం కారణంగా తప్పుకున్నాడు. వాస్తవానికి విండీస్తో టి20 సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్లు చోటు దక్కించుకున్నప్పటికి ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. టి ట్వంటీ సిరీస్ ప్రారంభానికి ఇంకా ఎనిమిది రోజుల సమయం ఉండడంతో ఈలోగా రాహుల్ కోవిడ్ నుంచి కోలుకునీ ఫిట్నెస్ సాధిస్తేనే టీ ట్వంటీ సిరీస్లో ఆడేందుకు అవకాశముంది.