మహిళల ఐపీఎల్ (Women Premier League) తొలి సీజన్కు కౌంట్డౌన్ మొదలైంది. శనివారం ముంబై డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఆరంభ మ్యాచ్ జరగనుంది. తొలిసారి నిర్వహిస్తున్న వుమెన్స్ లీగ్ ఆరంభ వేడుకల కోసం బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు కియారా అద్వానీ, కృతిసనన్ , ఫేమస్ సింగర్ శంకర్ మహదేవన్తో పాటు మరికొందరు స్టార్స్ పెర్ఫార్మ్ చేయనున్నట్టు తెలుస్తోంది. మహిళల క్రికెట్కు సంబంధించి భారత్లో ఇలాంటి లీగ్ నిర్వహించడం ఇదే తొలిసారి కావడంతో గ్రాండ్ సక్సెస్ చేసేందుకు బీసీసీఐ పట్టుదలగా ఉంది.
ఇప్పటికే టిక్కెట్లకు సంబంధించి సేల్స్ కూడా మొదలయ్యాయి. మహిళలను స్టేడియంలో ఉచితంగా అనుమతించనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. అలాగే టిక్కెట్లు కూడా అందరికీ అందుబాటులో ఉండేలా కేవలం 100 రూపాయల నుంచి 400 రూపాయల వరకే ధరలుగా నిర్ణయించింది. తక్కువలో టిక్కెట్లు ధరలు ఉండడంతో అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశముందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
Also Read: Prabhas and Anushka: అనుష్కతో ప్రభాస్ బ్రేకప్.. కారణమిదే!
గత ఏడాది డిసెంబర్లో భారత్,ఆస్ట్రేలియా మధ్య సిరీస్కు వాంఖడే స్టేడియం ఆతిథ్యమివ్వగా.. అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 35 వేల మంది వరకూ స్టేడియానికి వచ్చి మ్యాచ్లను వీక్షించారు. ఈ నేపథ్యంలో వుమెన్స్ ఐపీఎల్కు కూడా ఇదే తరహా రెస్పాన్స్ వస్తుందని బీసీసీఐ అంచనా వేస్తోంది. మహిళల ఐపీఎల్ తొలి సీజన్ మొత్తం ముంబైలోనే జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియంతో పాటు డీవై పాటిల్ స్టేడియం తొలి సీజన్కు ఆతిథ్యమివ్వనున్నాయి. మార్చి 4న జరిగే ఆరంభ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ , గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి.
ఇటీవల నిర్వహించిన ప్లేయర్స్ వేలంలో పలువురు భారత క్రికెటర్లు భారీస్థాయిలో అమ్ముడయ్యారు. అలాగే మహిళల ఐపీఎల్కు సంబంధించిన మీడియా ప్రసారహక్కులు కూడా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. అటు ఫ్రాంచైజీల బిడ్డింగ్ ద్వారా బీసీసీఐ అనుకున్నట్టుగానే భారీ ఆదాయాన్ని ఆర్జించింది. మొత్తం మీద వుమెన్స్ ఐపీఎల్ తొలి సీజన్ ఆరంభానికే ముందే సరికొత్త రికార్డులు సృష్టించగా.. ఇక లీగ్ మరింత వినోదం అందిస్తుందని బోర్డు వర్గాలు ఆశిస్తున్నాయి.