KC Cariappa: మార్చి చివరి వారంలో ఐపీఎల్ 2026 ప్రారంభం కానున్న తరుణంలో భారత క్రికెటర్ కేసీ కరియప్ప క్రికెట్ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. తన రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెడుతూ తన ప్రయాణంలో తోడున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కరియప్ప ఐపీఎల్ కెరీర్ చిన్నదే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
భావోద్వేగంతో కూడిన వీడ్కోలు
కరియప్ప తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఇలా రాశారు. వీధుల నుండి మొదలైన ప్రయాణం స్టేడియం వెలుగుల వరకు చేరింది. ప్రతి జెర్సీని ఎంతో గర్వంగా ధరించాను. నా చిన్ననాటి కలను నేను జీవించాను. ఈ రోజు అధికారికంగా బీసీసీఐ క్రికెట్ నుండి నా రిటైర్మెంట్ను ప్రకటిస్తున్నాను. ఈ ప్రయాణం నాకు అన్నీ ఇచ్చింది. గెలుపు నన్ను సంతోషపెట్టింది. ఓటమి నా గుండెను ముక్కలు చేసింది. నాకు ఎంతో నేర్పింది. నాపై నమ్మకం ఉంచిన కేఎస్సీఏ (KSCA) కి ధన్యవాదాలు అని రాసుకొచ్చాడు.
Also Read: లండన్ లో అంబరాన్ని తాకిన ‘గోదారోళ్ళ సంక్రాంతి వేడుకలు – 2026’
మిజోరం క్రికెట్ అసోసియేషన్ తనను ఒక కుటుంబ సభ్యుడిలా ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 7 ఏళ్ల తన ఐపీఎల్ ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుందని, KKR, PBKS, RR జట్లకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. “నేను బీసీసీఐ క్రికెట్ నుండి రిటైర్ కావచ్చు. కానీ ఈ ఆటపై నాకున్న ప్రేమ నుండి ఎప్పటికీ రిటైర్ అవ్వను” అని ముగించారు.
ఐపీఎల్ ద్వారా కోట్లాది రూపాయల సంపాదన
కేసీ కరియప్ప ఐపీఎల్లో 7 సంవత్సరాల పాటు కొనసాగారు. తన కెరీర్లో మూడు వేర్వేరు జట్ల తరపున ఆడారు.
KKR (కోల్కతా నైట్ రైడర్స్): 2015లో కరియప్పను కేకేఆర్ రూ. 2.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. 2019లో రిప్లేస్మెంట్ ప్లేయర్గా రూ. 20 లక్షలకు మళ్ళీ కేకేఆర్ లో చేరారు.
PBKS (పంజాబ్ కింగ్స్): పంజాబ్ తరపున రెండు సీజన్లు ఆడి రూ. 1.60 కోట్లు సంపాదించారు.
RR (రాజస్థాన్ రాయల్స్): 2021 నుండి 2023 వరకు రాజస్థాన్ జట్టులో ఉండి మొత్తం రూ. 80 లక్షలు ఆర్జించారు. మొత్తంగా ఐపీఎల్ ద్వారా ఆయన సుమారు రూ. 5 కోట్లు సంపాదించారు. తన కెరీర్లో మొత్తం 11 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన కరియప్ప 8 వికెట్లు పడగొట్టారు.
