RR vs RCB: ఐపీఎల్ 17వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్ లోనూ విజయం సాధించింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన బెంగళూర్ కు మంచి ఆరంభమే దక్కింది. ఆది నుంచే విరాట్ కోహ్లి, డుప్లెసిస్ చెలరేగారు. తొలి వికెట్కు 14 ఓవర్లలో 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరు దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించడంతో ఆర్సీబీ పవర్ప్లేలో 53 పరుగులు చేసింది. డుప్లెసిస్ 44 రన్స్ కి ఔట్ అయ్యాక మాక్స్వెల్ మరోసారి నిరాశపరిచాడు. అరంగేట్ర ప్లేయర్ సౌరవ్ చౌహన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. మరోఎండ్లో బ్యాటర్ల నుంచి సహకారం గొప్పగా లభించనప్పటికీ కోహ్లి తనదైన రీతిలో చెలరేగాడు. తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ సెంచరీ సాధించాడు. 67 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఐపీఎల్లో కోహ్లికి ఇది 8వ సెంచరీ. కోహ్లీ 72 బంతుల్లో అజేయంగా 113 పరుగులు చేశాడు. బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు, బర్గర్ ఓ వికెట్ తీశారు.
We’re now on WhatsApp. Click to Join
184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అయితే బట్లర్, సంజూ శాంసన్ కీలక పార్టనర్ షిప్ తో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ దూకుడుగా సాగింది. వీరిద్దరి జోరుతో రాజస్తాన్ పవర్ ప్లే లో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా వీరి జోరు తగ్గలేదు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 69 పరుగులు చేసిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.. సిరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. చివర్లో మరో రెండు వికెట్లు పడినా సాధించాల్సిన రన్ రేట్ తగ్గిపోవడంతో రాజస్థాన్ ఈజీగా గెలిచింది. చివర్లో సిక్స్ కొట్టిన బట్లర్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.
Also Read; MLA Tellam Venkata Rao: కేసీఆర్ కు బిగ్ షాక్.. తుక్కుగూడ సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే