Jasprit Bumrah: బుమ్రా ఔట్‌.. సిరాజ్ ఇన్‌.. బీసీసీఐ అధికారిక ప్ర‌క‌ట‌న‌..!

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ కోసం టీమిండియాలోకి హైదరాబాద్‌ పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వచ్చాడు.

  • Written By:
  • Updated On - September 30, 2022 / 12:40 PM IST

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ కోసం టీమిండియాలోకి హైదరాబాద్‌ పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వచ్చాడు. గాయం కార‌ణంగా ఈ సిరీస్‌కు దూర‌మైన బౌల‌ర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా స్థానంలో సిరాజ్‌ను తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో స‌ఫారీతో జరగబోయే మిగిలిన‌ రెండు టీ20 మ్యాచ్‌లకు బుమ్రా దూర‌మ‌య్యాడు. అయితే.. గాయం కార‌ణంగా టీ20 వరల్డ్‌కప్‌ కూడా బుమ్రా ఆడటం లేద‌ని బీసీసీఐ అధికారి ఒక‌రు వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుద‌ల కాలేదు. సౌతాఫ్రికా సిరీస్‌కు సిరాజ్‌ను తీసుకున్నా.. వరల్డ్‌కప్‌లో బుమ్రా స్థానంలో ఎవర్నీ ఆడిస్తార‌నేది తెలియాల్సి ఉంది.

బుమ్రా స్థానంలో సిరాజ్‌ను తీసుకుంటున్న‌ట్లు శుక్రవారం ఉదయం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. సౌతాఫ్రికాతో మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వ‌న్డేల‌ను టీమిండియా ఆడ‌నుంది. ఇప్ప‌టికే తిరువ‌నంత‌పురం వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20లో భార‌త్ ఘ‌నవిజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే గాయం కార‌ణంగా ర‌వీంద్ర జ‌డేజా, క‌రోనా కార‌ణంగా ష‌మీ టీమిండియా జ‌ట్టుకు దూర‌మ‌య్యారు. ఆస్ట్రేలియా వేదిక‌గా అక్టోబ‌ర్ 16 నుంచి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే.

సౌతాఫ్రికాతో మిగిలిన రెండు టీ20లకు భారత జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌(వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌, దినేశ్‌ కార్తిక్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, యజువేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షల్‌ పటేల్‌, దీపక్‌ చహర్‌, ఉమేశ్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, షాబాజ్‌ అహ్మద్‌, మహ్మద్‌ సిరాజ్‌