బంగ్లాదేశ్ (Bangladesh) తో టెస్ట్ సిరీస్ (Test Series) కు ముందు భారత్ (India) కు ఎదురుదెబ్బ తగిలింది. వరుస గాయాలతో ముగ్గురు కీలక ఆటగాళ్ళు దూరమయ్యారు. తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమవగా, సిరీస్ మొత్తానికి షమీ, జడేజా గాయాలతో తప్పుకోవాల్సి వచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ రెండో వన్డే సందర్భంగా గాయపడడంతో స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. వైద్యులను సంప్రదించిన తర్వాత కొన్నిరోజులు ఆటకు దూరంగా ఉండనుండడంతో తొలి టెస్ట్ ఆడడం లేదు. హిట్ మ్యాన్ స్థానంలో కె. ఎల్. రాహుల్ సారథిగా వ్యవహరించనున్నాడు.
అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక గాయాలతోనే జడేజా, షమీ సిరీస్ కు దూరమవడంతో వీరిద్దరి స్థానంలో నవదీప్ శైనీ, సౌరవ్ కుమార్ లకు అవకాశం దక్కింది. అలాగే దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న పేసర్ జయదేవ్ ఉనాద్కట్ ను కూడా బంగ్లాతో టెస్ట్ సిరీస్ కు సెలక్టర్లు ఎంపిక చేశారు. జడేజా, షమీ గాయాల నుంచి పూర్తిగా కోలుకోలేదని బోర్డు వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే, రోహిత్ స్థానంలో ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్.. ప్రస్తుతం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న భారత-ఏ జట్టుకు సారధిగా వ్యవహిస్తున్నాడు. బంగ్లాతో అనధికారిక టెస్టు సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు బాది సూపర్ ఫామ్లో ఉన్నాడు. డిసెంబర్ 14 నుంచి భారత్ (India) – బంగ్లాదేశ్ (Bangladesh) జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.
Also Read: India Women T20 : టీ20 రెండో మ్యాచ్ లో భారత మహిళల “సూపర్” విక్టరీ