ఆసియాకప్లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా ఆసియాకప్ నుంచి జడేజా తప్పుకున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. జడేజా గాయంపై స్పష్టత లేదన్న బీసీసీఐ ప్రస్తుతం అతను బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నట్టు తెలిపింది. కాగా జడేజా స్థానంలో అక్షర్ పటేల్ను ఎంపిక చేసారు.
టోర్నీ ఆరంభానికి ముందే స్టాండ్ బై ఆటగాళ్ళ జాబితాలో అక్షర్ ఉన్నాడు. ఇప్పుడు జడేజా దూరమైన నేపథ్యంలో తుది జట్టులోకి రానున్నాడు. కీలకమైన సూపర్ 4 స్టేజ్కు ముందు జడేజా లేకపోవడం భారత్కు ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. ఆసియాకప్లో ఇప్పటి వరకూ భారత్ ఆడిన రెండు మ్యాచ్లలోనూ జడేజా రాణించాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 35 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
హాంకాంగ్తో మ్యాచ్లో జడేజాకు బ్యాటింగ్ అవకాశం రానప్పటికి ఫీల్డింగ్లో అదరగొట్టాడు. అయితే జడేజా స్థానంలో వచ్చిన అక్షర్ పటేల్ కూడా ఫామ్లో ఉండడం అడ్వాంజేట్గానే చెప్పాలి. ఇటీవల జింబాబ్వే టూర్లో అక్షర్ బంతితో పాటు బ్యాట్తోనూ రాణించాడు. ఇదిలా ఉంటే ఆసియాకప్ సూపర్ 4 స్టేజ్లో భారత తన తొలి మ్యాచ్ను ఆదివారం ఆడనుంది.